కులవృత్తులకు పునర్జీవం పోసే సత్సంకల్పంతో కేసీఆర్ సర్కారు తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు వారికో కొత్త దారిని చూపి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఒకప్పుడు చేద్దామంటే పని దొరకక కూలీలుగా, నౌకర్లుగా చాకిరీ చేసిన వారికి జీవనాధారం చూపి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. వీరిలో ముఖ్యంగా తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా మేకలు, గొర్రెలనే నమ్ముకొని బతికే గొల్లకుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై జీవాలను అందించే పథకం సత్ఫలితాలనిస్తోంది. మొదటి విడుత అందుకున్న యూనిట్(21 గొర్రెల)ను మంచిగ సాదుకోవడంతో పిల్లలు పెద్ద మందగా మారి వారికి బతుకుదెరువును చూపిస్తున్నాయి. ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు సర్కారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడు అందిపుచ్చుకోవడం వల్ల అంతటా ఎలమందహాసమే కనిపిస్తోంది. ఇప్పటికే తొలి విడుతలో జీవాలను పంపిణీ చేసి, కొండంత అండగా నిలిచిన కేసీఆర్ సర్కార్ తాజాగా రెండో విడుత పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించడంతో వారిలో సంతోషం రెట్టింపయ్యింది. ఇలా ఉన్న ఊరిలో ఉపాధి మార్గం చూపి కులవృత్తులకు పెద్దపీట వేయడం వల్లే తాము సగౌరవంగా జీవిస్తున్నామని ఇదంతా బీఆర్ఎస్ సర్కారు చలవేనంటూ కేసీఆర్కు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 9
డీడీలు కట్టినోళ్లకు గొర్రెలొస్తున్నయ్..
సర్కార్ ఈ గొర్ల పంపిణీ మొదలు పెట్టినప్పటి నుంచి గొడ్ల దవాఖాన అధికారులు మాకు మీటింగ్లు పెట్టి సంఘ సభ్యులందరికి డీడీలు తీయాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లుగానే మావోళ్లందరితోని డీడీలు తీయించినం. ఫస్టోల్లందరికి గొర్లు వచ్చినయ్. వాటిని అందరు మంచిగనే మేపుకొంటున్నరు. ఎవుసంతో పాటు వేరేవేరే పని ఉన్నోళ్లు ఐదారుగురు కలిసి ఒక్కదిక్కు మనిషిని పెట్టుకొని మేపుతాన్రు. ముందుగాల ఇచ్చిన వాటికి రెండుసార్లు పిల్లలు అయినయ్. సబ్సిడీ గొర్లతోటి ఊర్లల్ల శానమంది మంచిగ బతుకుతున్నరు. ఈ మందలతోటి రైతుల పొలాల్లో ఎరువు కోసం రాత్రి పూట గొర్లను తోలినా ఆసాములు పైసలిస్తాండ్రు. చిల్లర ఖర్చులు ఎల్లిపోతానయ్. ఇంతమంచిగ ఆదుకుంటున్న కేసీఆర్ సార్కు గొల్లకురుమోళ్లమందరం రుణపడి ఉంటం.
– అల్లి సమ్మయ్య, గొర్రెల పెంపకందారుల అధ్యక్షుడు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
గొర్రెల అమ్మకాలు మస్తు పెరిగినయ్..
నేను పదేళ్లుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో గొర్రెల వ్యాపారం చేస్తున్నా. ఇదివరకు మన దగ్గర గొర్రెల సంఖ్య చాలా తగ్గిన సందర్భాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి కూడా గొర్రెలను కొనుక్కొచ్చి ఇక్కడ మాంసం వ్యాపారులకు అమ్మేటోన్ని. పండుగలప్పుడైతే గొర్రెలు దొరుకుడు చాలా కష్టమయ్యేది. ఇప్పుడు మాత్రం కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకం వల్ల పరిస్థితి పూర్తిగా మారింది. గతంలో పండుగలు, శుభాకార్యాలప్పుడే మాంసం తినేవారు. ఇప్పుడు ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంట్లోకి తెచ్చుకుంటున్నారు. ఊరికి పది యాటలన్నా తెగుతున్నాయి. గిట్లాంటి టైంలో గనక గొర్రెల పంపిణీ పథకంలోని పిల్లలు అందుబాటులోకి రానైట్లెతే చాలా ఇబ్బందిగా ఉండేది. గతేడాది నుంచే కొత్త పిల్లలు అమ్మకానికి వస్తున్నాయి. చాలా ఊర్ల నుంచి మా వద్ద కొదమ పిల్లలు ఉన్నాయని ఫోన్లు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది మన ప్రాంతంలో ఏ స్థాయిలో గొర్రెల సంఖ్య పెరిగిందనేది.
– మంతుర్తి కొమురయ్య, గొర్రెల వ్యాపారి, దామెర, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా
ఆర్థిక ఇబ్బందులన్నీ తీరినయ్..
మహదేవపూర్, సెప్టెంబర్ 9 : తాతల కాలం సంది గొర్లకాసుడే మా జీవనాధారం. కులవృత్తినే నమ్ముకొని బతుకుతున్నం. నాడు గొర్లు కొనడానికి చేతిలో పెట్టుబడి లేక శాన కష్టమయ్యేది. అప్పుడు మమ్ముల ఏ సర్కారోళ్లు సుత పట్టించుకోలే. ఆ పరిస్థితిలో కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక గొల్ల కురుమల జీవితాల్లో కేసీఆర్ సారు వెలుగు నింపిండు. సబ్సిడీ గొర్లు ఇచ్చి కులవృత్తుల వారికి ధైర్యం ఇచ్చిండు. అప్పటిసంది మా యాదవుల బతుకులు మారినయ్. నాడు గొర్ల కాపరిగా ఉన్న నేను కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం వల్ల గొర్ల మందకు యజమాని అయిన. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా ఆర్థిక ఇబ్బందులన్నీ తీరినయ్. జీవితంపై భరోసా వచ్చింది. కులవృత్తిదారులకు సమాజంలో విలువ పెరిగింది.
– పిడుగు మల్లయ్య యాదవ్, గొర్ల యజమాని, మహదేవపూర్
ఇంటికి పెద్దన్న అయిండు..
బచ్చన్నపేట, సెప్టెంబర్ 9 : ప్రజలకు ఎన్నో పథకాలు అమలుచేస్తూనే గొల్లకుర్మలకు ఇచ్చిన మాట ప్రకారం గొర్లు ఇస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. మొదటి విడుతలో కొందరికి గొర్రెలు ఇచ్చిన్రు. రెండో విడుతలో మాకు వచ్చినయ్. 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చిన్రు. గొర్లు ఇచ్చి మా కుటుంబాలకు పెద్దన్న లెక్క అండగా ఉన్నడు. ఆయన రుణం జన్మలో తీర్చుకోలేం. మళ్లీ కేసీఆర్ సారే రావాలె. మరిన్ని పథకాలు తీసుకరావాలే. మంచి పనులు ఎన్నో చేయాలె. నేను రూ. 43,750 కట్టిన సీఎం కేసీఆర్ సారు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి రూ.1,70 లక్షల విలువ చేసే గొర్రెలు మాకిచ్చిండు. చాలా సంతోషంగా ఉంది.
– బింగి నరేశ్, రామచంద్రాపూర్, బచ్చన్నపేట మండలం
గొర్రెలే నాకు ఆధారం
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పదేళ్లుగా గొర్రెలు కాసుకుంట బతుకుతున్న. నాకు ఎలాంటి భూమిజాగలు లేవు. నా భార్య కూలి పనికి పోతది. నేను గొర్రెలు కాసుకుంట. మొదట్ల కొన్ని గొర్రెలు ఉండె. వాటితో బతుకుడు కష్టమయ్యేది. కేసీఆర్ ఏడేళ్ల కిందట గొర్రెలు ఇచ్చిండు. నాకున్న గొర్రెలతో కలిపి కేసీఆర్ ఇచ్చిన గొర్రెలను సాదుకున్న. వాటిని పెంపు చేసుకున్న. పెద్దగైన గొర్రెలు అమ్ముకుంటూ నా అవసరాలు తీర్చుకుంటన్న. ఇప్పుడు 80 దాక గొర్రెలు ఉన్నయ్. ఏడాదికి రెండు పిల్లలు పెడుతన్నయ్. నాకు వేరే ఆధారం లేదు. చిన్న గుడిసె ఉండె. ఇప్పుడు రేకుల షెడ్డు వేసుకున్న. ముగ్గురు కొడుకులను చదివించుకున్న. కేసీఆర్ తొవ్వ సూపకపోతే ఇలా ఉండేటోన్ని కాదు. కేసీఆర్కి రుణపడి ఉంటం.
– పర్శ రవి, కొంపెల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కేసీఆరే తొవ్వ సూపిచ్చిండు..
రేగొండ, సెప్టెంబరు 9 : సీఎం సార్ వల్లే కులవృత్తులకు మళ్లీ జీవం వచ్చింది. అందరూ ఆర్థికంగా బలపడుతున్నరు. మా తాత, తండ్రి గొర్లు కాసే బతికిన్రు. మా తండ్రి ఇచ్చిన గొర్లు రోగమచ్చి పోయినయ్. నాకు గుంట భూమి సుతలేదు. దొరల దగ్గర గొర్లకాపరిగా జీతం ఉండేటోన్ని. చేద్దామన్నా వేరే ఆధారం లేక కూలి పనికి పోయినా కుటుంబం గడువక పోయేది. కానీ తెలంగాణ వచ్చినంక సబ్సిడీతోటి గొర్ల పథకం పెట్టినప్పుడు నేను కూడా దరఖాస్తు పెట్టిన. అప్పుడు నాకు 20గొర్లు వచ్చినయ్. సార్ ఇచ్చిన గొర్ల్లను మేపుకొని కుటుంబాని పోషించుకుంటున్నా. ఎవలి దగ్గ జీతానికి ఉండే అవసరం లేకుంట గోర్లను కాసుకుంటాన. వచ్చిన పైసలతోటి పిల్లలను మంచిగ చదివిస్తున్న. గొర్ల పథకం వల్ల నాలెక్క ఎంతోమంది మంచిగ బతుకుతున్నరు.
-కోడారి లసుమ్మయ్య, నారాయణపురం
గిట్ల గొర్లు ఎవ్వరూ ఇయ్యలే..
నర్సింహులపేట, సెప్టెంబర్ 9 : ఆరేళ్ల కింద ఇచ్చిన గొర్లతోటి ఇప్పుడు అవసరానికి అమ్మినవి పోను 150 దాకా ఉన్నయ్. పాలు మరిచిన తరువాత పోతు పిల్లలను అమ్మితే రూ.50వేల వరకు వస్తునయ్. ఎండాకాలంల పొలాల్లో మంద పడితే అందరికీ కలిపి రోజుకు రూ.2వేలు ఇస్తరు రైతులు. ఏడాదిలో 45 రోజుల పాటు మందను వ్యవసాయ పొలాల్లో పెడుతాం. ఇంటి దగ్గర ఉన్న గొర్రె ఎరువుకు ట్రాక్టర్కు రూ.3వేల వరకు ఇస్తరు. మా పొలాల్లో సుత ఎరువు పోసుకుంటం. ప్రతి ఏడాది డాక్టర్లు మందులు ఇస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు పిలిస్తే గొర్రెలకు వైద్యం చేసి పోతాన్రు. నాకు నాలుగెకరాల పొలానికి ఏడాదికి రూ.40వేలు వస్తయ్. నాకు 60 ఏళ్లు. చిన్నప్పటి నుంచి గొర్లు కాసుకుంటనే బతుకుతున్న. నాకు తెలిసి ఇప్పటివరకు గొర్లు ఇచ్చిన నాయకుడిని చూడలేదు. మా అందరినీ ఆదుకుంటున్న కేసీఆర్కు అండగా ఉంటం.
– వల్లపు బుచ్చయ్య, పడమటిగూడెం
గొర్రెలతో మంచిగ బతుకుతున్నా..
వర్ధన్నపేట, సెప్టెంబర్ 9 : మాకు గతంలో 10 గొర్రెలు ఉండేవి. కేసీఆర్ సర్కారు మాకు మొదటి విడతల 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇచ్చింది. ఇప్పుడు 50 జీవాల వరకు ఉన్నయి. నేను 6వ తరగతి వరకు చదువుకున్న. గొర్రెలు తక్కువ ఉన్నప్పుడు కూలి పనికి పోయేది. కానీ కేసీఆర్ సార్ గొర్రెలు ఇచ్చినంక బందు వెట్టి జీవాలనే సాదుకుంటాన. పొటేలు, ముసలివైన గొర్రెలను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాన. ఆదాయం కూడా మంచిగనే ఉన్నది. పొటేళ్లను అమ్ముకుంటే ఏడాదికి రూ.లక్ష వరకు వస్తయ్. మా నాన్న దొంగల ఎల్లయ్యకు కూడా మొదటి విడతల గొర్రెలు వచ్చినై. ఇదివరకు వేరేటోళ్లకు కూళ్లకు పోయి ఇబ్బంది పడేది. కానీ నేనే గొర్రెలను పెంచుకుంటూ మంచిగ బతుకుతాన. ఇద్దరు పిల్లలను కూడా ప్రైవేటు బడిల చదివించుకుంటాన. కొద్దిగంత భూమి ఉన్నది. నా భార్య పొలం పనులు చూసుకుంటది.
– దొంగల రమేశ్, వర్ధన్నపేట
గొర్రెల పంపిణీతో మేలు
నర్సంపేట, సెప్టెంబర్ 9: కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పంపిణీ మాకు ఎంతో మేలు చేసింది. మా కుటుంబం ఆర్థికంగా బలపడేందుకు దారి దొరికింది. కేసీఆర్ ఇచ్చిన 21 గొర్రెలతో 84 గొర్రెలను చేసుకున్నా. ఇప్పుడు పెద్ద మందగా తయారైంది. గొర్రెల మందతో ఎంతో లాభం వస్తుంది. పోతులను అమ్ముకొని ఆడ గొర్రెలను మందలో సాదుకుంటున్నా. రూ.42750లు డీడీలు తీసి ఇచ్చిన. ఆంధ్రాలోని కడప జిల్లాకు పోయి తెచ్చుకున్నం. సార్లు దానాబస్తాలు, టానిక్లు ఇచ్చారు. నట్టల మందు కూడా ఇచ్చారు. నాకు ముగ్గురు కొడుకులు, ఇద్దరికి పెళ్లి చేసిన. వాళ్లు గొర్లు కాసుకుంట బతుకుతున్నరు. చిన్న కొడుకును డిగ్రీ వరకు చదివించిన. నేను, నా భార్య ఇద్దరం కలిసి జీవాలను పెంచుతున్నం. కేసీఆర్ ఇచ్చిన గొర్రెలతో మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నది. మాకున్న 30గంటల భూమిల వ్యవసాయం చేసుకుంట జీవాలను కాసుకుంట సంతోషంగా బతుకుతున్న.
– అమ్మ మల్లయ్య, అమీనాబాద్, చెన్నారావుపేట