కాజీపేట, మార్చి 5 : కాజీపేట రైల్వే జంక్షన్లోని గూడ్స్ యార్డులో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాత రైలు బోగీల్లో మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే గూడ్స్ యార్డులోని ఆర్-6 నంబర్ పట్టాలపై ఎనిమిది ప్రయాణికుల బోగీలను ఈ నెల 3న రాత్రి నిలిపారు. మంగళవారం ఈ యార్డు నుంచి విపరీతమైన పొగ వచ్చి ఒక్కసారిగా మంటలు లేచాయి.
ప్లాట్ఫారానికి అతి సమీపంలో మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరైనా సిగరెట్ తాగి పడేయడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై విచారణ చేపట్టామని రూ.50లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు.