గొర్రెల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి రెండో విడుత యూనిట్ల పంపిణీ జరుగనుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 45,745 మంది గొల్లకుర్మలకు లబ్ధి చేకూరనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు డబ్బు ఐదు శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఇప్పటికే తొలి విడుతలో గొర్రెల యూనిట్లు పొందిన 56,414 మంది మంచి ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. పేదల పెన్నిది సీఎం కేసీఆర్ తమకు గొర్రెలు ఇచ్చి తమ జీవితాల్లో వెలుగులు నింపారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, జూన్ 8(నమస్తేతెలంగాణ)
వరంగల్, జూన్ 8(నమస్తేతెలంగాణ) : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఊతం ఇస్తున్నది. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగు నింపేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా డబ్బు ఐదు శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే పలువురికి తొలి విడుత గొర్రెలను అందజేసింది. వీటిని పొందిన లబ్దిదారులు ఏటేటా గొర్రెల మంద పెరిగిపోతుండడంతో మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. సర్కారు సాయంతో జీవనోపాధిపై భరోసా ఏర్పడిందని ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదే రోజు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. గొల్లకుర్మలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం రూ.11 వేల కోట్లతో గొర్రెల యూనిట్ల పంపిణీ చేపట్టింది. ముందుగా స్పెషల్ డ్రైవ్ ద్వారా అర్హులైన గొల్ల కుర్మలను గుర్తించి వారికి గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో సభ్యత్వం కల్పించింది. డ్రా పద్ధతిలో తొలి, రెండో విడుత గొర్రెల పంపిణీకి లబ్ధిదారుల జాబితాలను తయారు చేసింది. ఒక్కో లబ్ధిదారుకు 20 ఆడ గొర్రెలు, ఒక మగ గొర్రె కలిపి ఒక యూనిట్గా అందజేయాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్ ధరను రూ.1.25 లక్షలుగా నిర్ణయించి ఇందులో ప్రభుత్వం 75 శాతం, లబ్ధిదారుడు 25 శాతం చెల్లించాలని ప్రకటించింది. 2017 జూన్లో తొలి విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించింది. రూ.5 వేల కోట్లతో 3,93,552 మందికి యూనిట్లను పంపిణీ చేసింది. ఇందులో ప్రభుత్వ వాటా రూ.3,751 కోట్లు కాగా, లబ్ధిదారుల వాటాధనం రూ.1,250 కోట్లు.
ఉమ్మడి జిల్లాలో…
ఉమ్మడి జిల్లాలో తొలి విడుత 56,414 మంది గొల్లకుర్మలకు సుమారు రూ.758 కోట్ల గొర్రెల పంపిణీ జరిగింది. వరంగల్ జిల్లాలో రూ.130 కోట్లతో 10,189, హనుమకొండ జిల్లాలో రూ.178 కోట్లతో 13,740, మహబూబాబాద్ జిల్లాలో రూ.149 కోట్లతో 11,901, జనగామ జిల్లాలో రూ.132 కోట్లతో 10,520, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.127 కోట్లతో 6,772, ములుగు జిల్లాలో రూ.42 కోట్లతో 3,292 మంది గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ జరిగినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. రెండో విడుత ఉమ్మడి జిల్లాలో 45,745 మందికి గొర్రెల పంపిణీ జరుగనుంది. వరంగల్ జిల్లాలో 12,764, హనుమకొండ జిల్లాలో 7,318, మహబూబాబాద్ జిల్లాలో 11,868, భూపాలపల్లి జిల్లాలో 6,043, జనగామ జిల్లాలో 4,499, ములుగు జిల్లాలో 3,253 మందికి పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 24 మందికి 24 యూనిట్లు అంటే 504 గొర్రెల చొప్పున పంపిణీ చేయాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొర్రెల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్కెట్లో గొర్రెల ధరలు పెరిగిన దృష్ట్యా ఒక్కో గొర్రెల యూనిట్ ధరను ప్రభుత్వం రూ.1.25 లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచింది. ఇందులో ప్రభుత్వం రూ.1,31,250 సబ్సిడీగా ఇవ్వనుండగా, లబ్ధిదారుడు రూ. 43,750 చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఎంపిక చేసిన రాష్ర్టాల్లో లబ్ధిదారుల కోరిక మేరకు అధికారులు గొర్రెలను కొనుగోలు చేశారు.
114 గొర్లతో పెద్ద మంద అయింది : బుడగొండ కుమారస్వామి, లబ్ధిదారుడు, దాసరిపల్లి
మాది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామం. నాలుగేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో నాకు 21 గొర్లను ఇచ్చింది. ఇప్పుడు అవి 114 గొర్లుగా ఎదిగాయి. నాకు భార్య కోమల, కూతుళ్లు అనూష, శిరీష ఉన్నారు. ప్రభుత్వం గొర్లను ఇవ్వకుముందు నాకున్న ఎకరంలో 20 గుంటలు పెద్ద బిడ్డకు కట్నంగా ఇచ్చాను. ఉన్న అర ఎకరాన్ని చిన్న బిడ్డకు కట్నం ఇవ్వడంతో పాటు పెళ్లి ఖర్చులు మొత్తం చేతుల మీదనే ఎల్లదీసిన. ఇటీవల చిన్న బిడ్డ పెళ్లప్పుడు గొర్ర మందలో నుంచి కొన్ని మరకలు (గొర్లను) తీసేసిన. వచ్చిన రూ.ఐదారు లక్షలు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడింది. నాకు రేకుల ఇల్లు, దాని ముందు గొర్లకు మరొక రేకుల షెడ్డు మాత్రమే ఉంది. గొర్లతో కుటుంబ అవసరాలు ఎక్కువగా తీరాయి. ప్రస్తుతం సెంటు భూమి లేదు కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన గొర్లు మాత్రం ఉన్నాయి. అదే ధైర్యంతో ముందుకుపోతున్నా. ఆయన పుణ్యమాని మా కుటుంబం ఎంతో బాగు పడింది. జీవితాంతం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.