జేపీఎస్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ జూనియర్ కార్యదర్శుల వివరాల సేకరణకు ప్రత్యేక కమిటీని నియమించారు. రెగ్యులరైజేషన్కు ప్రతిభే ప్రామాణికం కానుండగా, హనుమకొండ జిల్లాలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకొన్న వారిని గుర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి జిల్లాలోని 128 మంది పనితీరును పరిశీలిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. సర్కారు నిర్ణయంతో కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హనుమకొండ, జూలై 16 : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి సర్వీసు వివరాలు సేకరించాలని ఆదేశిస్తూ ఇందుక ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఎఫ్వో, ఎస్పీకానీ, ఎస్పీ నామినేట్ చేసిన డీఎస్పీ సభ్యులుగా ఉంటారు. వీరు జేపీఎస్లు పనిచేసే జీపీలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. హనుమకొండ జిల్లాలో 208 గ్రామ పంచాయతీలు ఉండగా 128 మంది జేపీఎస్లు పని చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కార్యదర్శుల వివరాలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకొనే ఈ నిర్ణయంతో ఇక నుంచి జేపీఎస్లు రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు. క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ప్రభుత్వం మొబైల్ యాప్లో ప్రత్యేకంగా రూపొంచిన ఫార్మట్లో వివరాలను అప్లోడ్ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 128 మంది జేపీఎస్లు
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ ప్రక్రియను రాష్ట్ర సర్కారు వేగవంతం చేసింది. 2019లో జేపీఎస్లను ప్రభుత్వం నియమించింది. జిల్లాలో 208 జీపీలుండగా 128 మంది కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరు ఉద్యోగంలో చేరినసమయంలో మూడు సంవత్సరాలు ప్రొబేషనరీ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మరో ఏడాది పొడిగించి నాలుగు సంవత్సరాలు చేసింది. ప్రస్తుతం జేపీఎస్ల సర్వీసు, వారి విధి నిర్వహణపై విచారణ చేసి నివేదించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా హనుమకొండ జిల్లాలో నాలుగు ఏండ్లు పూర్తి చేసుకున్నవారు దాదాపుగా 85 నుంచి 90 మంది ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
క్షేత్ర స్థాయిలో విచారణ
పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి అధికారిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో కార్యదర్శులు నియామకం చేపట్టింది. మొదట ఏప్రిల్లో మొదటి జాబితా, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండో జాబితా ద్వారా జేపీఎస్లను నియమించారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి నియమించిన కమిటీ సేకరిస్తుంది. ఆయా గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం చూపిన మార్గదర్శకాలను అమలు చేసారా ? విధుల నిర్వహణ.. తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. అయితే జిల్లాలో మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభించామని పూర్తయ్యేందుకు 25 రోజులు పట్టే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు తెలిపారు. అయితే జేపీఎస్లు విధుల్లో చేరినపుడు ఉన్న మూడు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ను ప్రభుత్వం నాలుగు సంవత్సరాలకు పెంచిందన్నారు. ఈ క్రమం లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన వారు ఎందరు ఉన్నారు ? వారి పనితీరును పరిశీలించి మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ప్రతిభే ప్రామాణికం..
క్షేత్ర స్థాయిలో కమిటీ జేపీఎస్ల పనితీరుపై విచారణ చేపడుతున్నారు. కార్యదర్శులు పని చేస్తున్న గ్రామ అభివృద్ధి, పల్లెప్రగతిలో జేపీఎస్ పాత్ర ఎంత ఉంది ? ఏ మేరకు పనిచేశారు ? ఎంత ప్రగతి సాధించిందనే అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ముఖ్యంగా జీపీ సాధారణ నిర్వహణ, రోడ్లు, మురుగు కాల్వలు, ప్రజల పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకున్న చర్యలు, జీపీ కార్యాలయం రికార్డుల నిర్వహణ, డంపింగ్ యార్డ్ వినియోగం, కంపోస్ట్ తయారీ, వైకుంఠధామాల నిర్వహణ, చెత్త సేకరణ, వంద శాతం పన్నుల వసూలు, నర్సరీ నిర్వహణ, మొక్కల పెంపకం, పెరిగిన మొక్కల శాతం, పల్లెప్రగతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లింపులు, పది శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, రికార్డుల నిర్వహణ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వంద మార్కులు కేటాయించారు. ఆయా అంశాలకు సంబంధించిన ప్రగతి ఆధారంగా కేటాయించగా వచ్చిన మార్కుల ఆధారంగా ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరిచి మొబైల్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత జేపీఎస్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించనున్నారని పీఆర్ అధికారులు తెలిపారు.
క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభించాం..
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో కార్యదర్శుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాం. పంచాయతీరాజ్ కమిషన్ మార్గదర్శకాల మేరకు మంగళవారం నుంచి కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించాం. ప్రస్తుతం జిల్లాలో 128 మంది జేపీఎస్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం విచారణ చేసి మొబైల్ ఆప్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నాం. జిల్లాలో 25 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వీ జగదీశ్వర్, డీపీవో, హనుమకొండ జిల్లా