ఖిలావరంగల్, జనవరి 5 : ఎలక్షన్ కమిషన్ రూపొందించిన జిల్లా ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి గురువారం విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 8 వరకు ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు వాటిని పరిష్కరించారు. నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మహిళా ఓటర్లే 7870 అధికంగా ఉండడం గమనార్హం. తుది జాబితా అనంతరం జిల్లాలో 7,05,833 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,48,855 మంది, మహిళలు 3,56,725 మంది ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 2,18,293 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,08,019 మంది, మహిళలు 1,10,271 మంది, హిజ్రాలు ముగ్గురున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 2,37,397 మంది ఓటర్లలో పురుషులు 1,16,259 మంది, మహిళలు 1,20,903 మంది, హిజ్రాలు 235 మంది, వర్ధన్నపేట నియోజకవర్గంలోని 2,49,545 మంది ఓటర్లలో పురుషులు 12,3,989 మంది, మహిళలు 12,5,541 మంది, హిజ్రాలు 15 మంది ఉన్నారు. అలాగే, సర్వీస్ ఓటర్లు నర్సంపేట నియోజకవర్గంలో 340 మంది, వరంగల్ తూర్పులో 88 మంది, వర్ధన్నపేటలో 170 మంది ఉన్నారు. మొత్తం 588 మంది ఉండగా, పురుషులు 588 మంది, మహిళలు 10 మంది ఉన్నారు.
ఖిలావరంగల్ : ఉర్సు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న పోగు అశోక్ను కలెక్టర్ బీ గోపి అభినందించారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సదస్సుకు జిల్లా నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయుడు అశోక్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గతంలో కూడా వరుసగా నాలుగుసార్లు రాష్ట్రస్థాయి సదస్సుకు జిల్లా నుంచి ఎంపికై పరిశోధన పత్రాలు అందజేశారు. దీంతో కలెక్టర్ తన చాంబర్లో అశోక్ను అభినందించి వృత్తినైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అలాగే, డీఈవో డీ వాసంతి, ఏఎంవో సారయ్య, డీసీఈబీ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఏసీజే నరసింహారావు, తోటి ఉపాధ్యాయులు అతడిని అభినందించారు.