పల్లెల్లో క్రీడా సంబురం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘సీఎం కప్-2023’ సోమవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యాన ఈ నెల 31వరకు జరిగే ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయగా క్రీడాకారులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరు జిల్లాల్లోని క్రీడా మైదానాల్లో స్థానిక మండల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.
పలుచోట్ల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిణి.. మేము సైతం అంటూ బరిలోకి దిగి వాలీబాల్ సర్వీస్ చేస్తూ కబడ్డీ ఆడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. తొలిరోజు వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, ఖో-ఖో పోటీల్లో ఆటగాళ్లు తమ ప్రతిభతో సత్తాచాటారు. ఈ నెల 17వరకు కొనసాగే మండల స్థాయి పోటీల్లో అథ్లెటిక్స్, లాంగ్జంప్, షార్ట్పుట్ పోటీలు కూడా నిర్వహించి విజేత జట్లతో 22-24 వరకు జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. దీంతో గ్రామాల్లో యువకులు క్రీడాపోటీల్లో సత్తా చాటి తమ ప్రాంతాలకు పేరు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 15