పర్వతగిరి, ఫిబ్రవరి 20: సర్కస్ ఆడేందుకు వచ్చిన ఆరేళ్ల చిన్నారి సంధ్యను ఓ బాలుడు పథకం ప్రకారమే కెనాల్ నీటిలో నెట్టేసి హత్య చేసినట్లు తేలింది. పర్వతగిరి పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ పీ రవీందర్ వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన బాలుడు అతడి అన్న చిన్న, వదిన శాంతి, వారి పిల్లలతో ఊరూరా తిరుగుతూ సర్కస్ ఆడేవాడు. వీరితో పాటు సమాని రవి, భార్య స్వప్న, పిల్లలు సంతోష, సంధ్య(మృతురాలు) కూడా సర్కస్ చేసేవారు. వీరందరూ ఇంటి నుంచి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఇస్లావత్ తండాకు వచ్చి చాలా రోజులవుతోంది. దీంతో ఆ బాలుడు ఊరిపై బెంగ పెట్టుకొని ఇంటికి పోతానని అన్నను చాలాసార్లు అడుగగా మందలించాడు. అయినా అతడికి ఇంటి మీద ధ్యాస పోలేదు. ఇంటి వద్ద పెంచుకున్న పెంపుడు కుక్కలను కూడా చూడాలని అనిపించింది. ఈ నెల 18న ఉదయం రెండు కుటుంబాలు పర్వతగిరి మండలంలోని ఇస్లావత్ తండాకు సర్కస్ ఆడేందుకు వచ్చాయి.
రెడ్లవాడకు వెళ్లే మార్గంలో ఉన్న చర్చికి ప్రార్థన చేసేందుకు బాలుడు వెళ్లాడు. అక్కడి కెనాల్లో నీళ్లు ప్రవహిస్తుండడం చూసి అతడు ఒక ఆలోచనకు వచ్చాడు. చిన్నారి సంధ్యను అందులో పడేస్తే.. అందరూ నీళ్లలో పడి చనిపోయిందని అనుకుంటారని, ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారని, వాళ్లు వెళ్లిపోతే తాము కూడా కొద్దిరోజులు సర్కస్ ఆడకుండా ఇంటికి వెళ్లొచ్చని భావించాడు. అనంతరం ఇస్లావత్ తండాకు వచ్చాడు. వారు ఉన్నచోటుకు కొద్ది దూరంలో పాప ఆడుకుంటుండగా మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో బయటికి వెళ్లొస్తానని అన్నతో చెప్పి అతడి బైక్ తీసుకొని కొంత దూరం వెళ్లాడు. వెనక్కి వచ్చి కొద్దిదూరం నుంచి సంధ్యకు సైగ చేసి బైక్పై ఎక్కించుకొని కెనాల్ వద్దకు తీసుకెళ్లాడు. మెట్లు దిగుతూ పాపను వెనుక నుంచి నీళ్లలో తోసేయడంతో మునిగి చనిపోయింది. తిరిగి ఏమీ తెలియనట్లు సంధ్య కోసం తల్లిదండ్రులతో కలిసి వెతికసాగాడు. పోలీసుల దర్యాప్తులో కెనాల్ వద్దకు తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే చంపినట్లుగా బాలుడిపై హత్య కేసు నమోదు చేశారు. కేసు ఛేదించిన పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై వీరభద్రరావు, పోలీస్ సిబ్బందిని ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ అభినందించారు.