కరీమాబాద్, జనవరి 7 : నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ సమస్యలు, పార్టీ నిర్మాణంపై కార్పొరేటర్ బైరబోయిన ఉమ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డివిజన్లలోని ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మిట్టపెల్లి కట్టమల్లు, నాయకుడు బైరబోయిన దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా..
కరీమాబాద్ : గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో ఏళ్ల తరబడిగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం రంగశాయిపేట తెలంగాణ కాలనీలోని సమస్యలను పరిశీలించారు. వాడవాడలా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో ప్రధాన సమస్య అయిన డ్రైనేజీ నిర్మాణం కోసం అధికారులతో మాట్లాడుతానన్నారు. ప్రణాళికలను రూపొందించి పనులు చేపట్టేలా చొరవ చూపుతానన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనులు చేస్తున్నదని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను కాలనీవాసులు సన్మానించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.