వరంగల్, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ) : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో వస్త్ర పరిశ్రమ త్వరలోనే ఉత్పత్తిని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే మార్చి నెలాఖరులోగా తొలిదశ ఉత్పత్తిని మొదలుపెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. పారిశ్రామికంగా వరంగల్ను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల శివారులో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరిగా రూపొందనున్న ఈ పార్కుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో పార్కు పనులు మొదలయ్యాయి. ఇక్కడ వస్త్ర పరిశ్రమల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నది. ఇప్పటికే రహదారులు నిర్మించి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసింది. సబ్స్టేషన్ నిర్మించింది. ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి మిషన్భగీరథ నీటిని సరఫరా చేస్తున్నది. టీఎస్ఐఐసీ ద్వారా మౌలిక వసతుల కల్పన పనులు పక్కా ప్రణాళికతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్కులో పరిశ్రమలు నెలకొల్పేందుకు దేశ, విదేశాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నార్త్ ఇండియాకు చెందిన గణేశా ఎకోపెట్-ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 50 ఎకరాల్లో యూనిట్ల నిర్మాణం చేపట్టింది. ఇటీవల ఒక యూనిట్లో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మే 7న మంత్రి కేటీఆర్ గణేశా కంపెనీకి చెందిన ఓ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత రెండో యూనిట్లో కూడా ఉత్పత్తి మొదలైంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది ఈ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు.
కేరళకు చెందిన ప్రముఖ కంపెనీ కిటెక్స్, టెక్స్టైల్ పార్కులో రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కేరళలో ప్రైవేట్రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ కిటెక్స్. చిన్న పిల్లల వస్ర్తాల తయారీలో ప్రత్యేకమైన కంపెనీ ఇది. ఈ కంపెనీ వస్ర్తాలు ధరించని పిల్లలు అమెరికాలో ఉండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కిడ్స్ అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కంపెనీ ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. గతేడాది కంపెనీ చైర్మన్ సాబు జాకబ్ టెక్స్టైల్ పార్కును సందర్శించారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి మంత్రి కేటీఆర్ ప్రధాన కారణమని ఆయన స్వయంగా చెప్పారు. మంత్రి కేటీఆర్ను కలిసినప్పుడు తనకు పెట్టుబడి కంటే ఇక్కడ ఉద్యోగావకాశాలు కావాలని అడిగారని, ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేశాక తొలుత అనుకున్న రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిని రూ.2,400 కోట్లకు పెంచామని ప్రకటించారు. దీంతో 22వేల ఉద్యోగాలు వస్తాయని, భవిష్యత్లో ఇక్కడినుంచి మూడు మిలియన్ల వస్ర్తాలను అమెరికాకు ఎగుమతి చేస్తామని సాబు జాకబ్ తెలిపారు. మున్ముందు తెలంగాణ వస్ర్తాలు ధరించని అమెరికా పిల్లలు ఉండబోరన్నది తమ నమ్మకమన్నారు. ఈయనతో మాట్లాడిన కేటీఆర్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఈ కంపెనీ పెట్టుబడితో 22వేల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు మరో 20వేల పరోక్ష ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని వెల్లడించారు. కంపెనీ స్థాపన పూర్తయ్యాక సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ కాటన్ను ఈ కంపెనీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. పార్కులో కిటెక్స్ కంపెనీకి కేటాయించిన స్థలంలో కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భారీ యంత్రాలను కూడా ఏర్పాటు చేసి వచ్చే మార్చిలోగా తొలి దశ ఉత్పత్తిని ప్రారంభించేందుకు కంపెనీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీకి టీఎస్ఐఐసీ 267 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ సుమారు రూ.3వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకొచ్చింది. గత మే 7న మెగా పార్కుకు వచ్చిన సమయంలో మంత్రి కేటీఆర్ ఈ కంపెనీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో వస్త్ర పరిశ్రమల స్థాపన పనులు చేపట్టేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. జనవరిలో ఇక్కడ పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉందని టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్రావు తెలిపారు. యంగ్వన్ కంపెనీ పరిశ్రమల పనులు కూడా వేగంగా చేపడుతారని, కైటెక్స్ కంపెనీ పరిశ్రమల్లో దశలవారీగా ఉత్పత్తి ప్రారంభం కానుందని వెల్లడించారు.