Ramppa Temple | వెంకటాపూర్, ఏప్రిల్ 16 : రామప్ప దేవాలయంలో ఈనెల 18న ప్రపంచ వారసత్వ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు, పర్యాటక శాఖలు, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కళాకారుడు శివమణి, సింగర్ కార్తీక్, ఫ్లూటిస్ట్ నవీన్తోపాటు 300 మంది కళాకారులు, పేరిణి రాజ్కుమార్ బృందం రానున్నారు.
బలగం చిత్ర యూనిట్ పాల్గొనడంతోపాటు ఆ సినిమాను ప్రదర్శించనున్నారు. పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 18వ తేదీన వారసత్వ కట్టడాల పరిరక్షణ, వారసత్వ కట్టడాలను రక్షించుకోవాలని అవగాహన, ప్రచారం కోసం 1982లో మొద ట ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోనుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకోమస్) ప్రారంభించగా, దాన్ని యునెస్కో 1983లో గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కట్టడాల్లో ఉత్సవాలను నిర్వహిస్తోంది. గతంలో రామప్ప నిర్మించి 800 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ఆల యంలో ఉత్సవాలు నిర్వహించగా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించిన తర్వాత ఈ ఏడాది రామప్పతోపాటు దేశంలోని 40 ప్రపంచ వారసత్వ కట్టడాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఇక నుంచి ఏటా రామప్పలో ఉత్సవాలు జరుగనున్నాయి.
భారీ వేదికకు ఏర్పాట్లు
వేడుకల కోసం భారీ వేదికతోపాటు సుమారు 15 వేల నుంచి 20వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించేలా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ప్రోమోను రామప్పలో చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రచారం చేస్తున్నారు. తొలిసారి భారీ స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించనుండటంతో అన్ని శాఖల అధికార యంత్రాంగం ఏర్పాటలో తలమునకలై ఉంది.
ఫుడ్ ఫెస్టివల్
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయం, సరస్సు వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ ప్రాంత వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇందులో చేనేత ఉత్పత్తులు, చేతి వృత్తుల వారు తయారుచేసిన వస్తువులు, ఎంటర్ ప్రైజెస్, డీఆర్డీఏ వాళ్ల స్టాల్స్, తదితర అంశాలు ప్రదర్శనకు పెట్టనున్నారు.
5గంటలు అలరించనున్న కార్యక్రమాలివీ..
18వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు రామప్ప దేవాలయం, సరస్సు వద్ద ఫుడ్ ఫెస్టివల్ 5 నుంచి 10గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించనున్నాయి. 5 గంటల నుంచి 5.30 వరకు రామప్ప టూరిజం వీడియోస్, సెలబ్రిటీ, స్పాన్సర్స్ వీడియోలు ప్రదర్శించనున్నారు. 5.30 గంటల నుంచి 70 మంది వయోలిన్ కళాకారులతో వయోలిన్ ప్రదర్శన, 6 గంటల నుంచి 6.15 వరకు యాంకర్ ద్వారా అతిథులకు స్వాగతం పలికి జ్యోతిప్రజ్వలన, 6.15 గంటల నుంచి 6.25 వరకు పేరిణి నృత్యప్రదర్శన, 6.25 గంటల నుంచి 6.35 వరకు రామప్ప హెరిటేజ్ వీడియో ప్రదర్శన, 6.35 నుంచి 6.50 వరకు రావణ నాటక ప్రదర్శన, 6.55 నుంచి 7.20 వరకు హెరిటేజ్ ఇండియా ఆధ్వర్యంలో 200 మంది కళాకారులతో క్లాసికల్, ఫోక్ నృత్య ప్రదర్శన, 7.20 నుంచి 7.30 వరకు బలగం సినిమా బృందానికి సత్కారం, 7.30 నుంచి 7.45 వరకు డ్యాన్స్ డైరెక్టర్ విజయజ్యోతి రాసిన రామప్ప ఆలయం నాట్యశాస్త్రం పుస్తక ఆవిష్కరణ, 7.45 నుంచి 7.55 వరకు లేజర్ షో ద్వారా రామప్ప స్టోరీ ప్రదర్శన, 8 నుంచి 8.15 గంటల వరకు వేదిక పైకి మంత్రులు, అతిథులకు ఆహ్వానం, వారి స్పీచ్లు, కళాకారులకు అభినందన, గ్రూప్ ఫొటో, 8.15 నుంచి 9.45 గంటల వరకు తమన్, శివమణి, కార్తీక్, ఫ్లూట్ నవీన్ల బృందం కాంకర్డ్, 9.45 నుంచి 9.50 గంటల వరకు ముగింపు ప్రసంగం ఉంటాయి. చివరలో లేదా కార్యక్రమానికి ముందు బలగం సినిమా ప్రదర్శించనున్నారు.