ప్రసూతి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సేవలను మరింత విస్తృతం చేసింది. కాన్పు కోసం వచ్చే వారు ప్రశాంతంగా ఉండేందుకు భవనాలు (బర్త్ వెయిటింగ్ రూంలు) నిర్మిస్తున్నది. ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీల్లో ఎనిమిది భవనాల నిర్మాణానికి రూ.1.12 కోట్లు మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పీహెచ్సీ, భూపాలపల్లి జిల్లా ఆజంనగర్, వరంగల్ జిల్లా మేడిపల్లి, ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు పీహెచ్సీలను ఎంపిక చేసింది. ప్రత్యేక గదితో పాటు సహాయకులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణలో భవనాల నిర్మాణం చేపడుతున్నారు. కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా మరి కొన్ని చోట్ల ప్రారంభించాల్సి ఉంది.
ఏటూరునాగారం, ఆగస్టు 24 : ప్రసూతి మహిళలకు ప్రభుత్వం అందించే సేవలు మరింత విస్తరిస్తున్నాయి. తాజాగా వైద్యశాలలకు కాన్పు కోసం వచ్చే వారికి ప్రత్యేక గదులతో ప్రశాంతంగా ఉండేందుకు భవనాలు (బర్త్ వెయిటింగ్ రూం) నిర్మిస్తుంది. ప్రైవేట్ వైద్యశాలల్లో నిత్యం జరిగే ప్రసవాలను ప్రభుత్వం ఇప్పటికే చెక్ పెట్టింది. కాన్పులు పూర్తిగా ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గర్భం దాల్చిన తర్వాత పేర్లు నమోదు చేసుకుని వారికి సేవలు అందిస్తుంది. తొలి దశలో టీడీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి రూ. 3వేలు కూడా అందిస్తుంది. ఇక మూడు నుంచి ఆరు నెలల లోపు న్యూట్రిషన్ కిట్ను పీహెచ్సీ పరిధిలో, ఏడు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో మరో కిట్ను ఏరియా వైద్యశాల ద్వారా గర్భిణులకు అందజేస్తారు. ఏరియా వైద్యశాల, సీహెచ్సీల్లో జరిగే చెకప్ల కోసం 102 అంబులెన్స్ ద్వారా వైద్యశాలకు తీసుకురావడం తర్వాత తీసుకపోవడం లాంటి ఉచిత సేవలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి. ప్రసవించగానే కేసీఆర్ కిట్ను వైద్యశాలలోనే తక్షణమే అందచేస్తున్నారు. పాపకు రూ.13 వేలు, బాబుకు రూ. 12వేలు ప్రభుత్వం నుంచి నేరుగా అందించే ప్రక్రియ కొనసాగుతోంది. మారుమూల గ్రామాల నుంచి సకాలంలో కాన్పు కోసం రాలేని వారికి ఈ భవనాల్లో ఎంతో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా రెండు, మూ డు రోజులు, గంటల ముందు వైద్యశాలకు ప్రసవానికి వచ్చే వారికి కూడా అందుబాటులో ఉండనున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వీటి నిర్మాణం జరుగుతోంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కాన్పు కోసం వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.14లక్షలతో భవనాలు నిర్మించేందుకు ప్రభు త్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో రూ.1.12 కోట్లతో ఎనిమిది భవనాలను మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పీహెచ్సీలో ఒకటి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్ పీహెచ్సీ, వరంగల్ జిల్లా మేడిపల్లి పీహెచ్సీ, ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు పీహెచ్సీ ప్రాంగణాల్లో వీటి నిర్మాణానికి ఆర్టికల్-275 కింద నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు కొన్ని పీహెచ్సీల పరిధిలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. పీహెచ్సీ పరిధిలో జరిగే ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు వసతి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా బర్త్ వెయిటింగ్ రూం భవనాల నిర్మాణం జరుగుతోంది. మహిళలకు నొప్పులు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండి వైద్యుల సలహాతో వైద్యశాలకు డెలీవరీకి పంపించనున్నారు. ప్రత్యేక గదితో పాటు సహాయకులు ఉండేలా నిర్మాణాలు చేస్తున్నారు. గదు ల్లో కూడా అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. వరదలు, విపత్తుల సమయంలో రవాణా సౌకర్యం నిలిచిపోయిన క్రమంలో గర్భిణులకు బర్త్ వెయిటింగ్ గదులు ఎంతో ఉపయోగపడనున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణలో భవనాల నిర్మాణం చేపడుతున్నారు. కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా, మరి కొన్ని చోట్ల ప్రారంభించాల్సి ఉంది.
గర్భిణులు కాన్పు తేదీ కంటే వారం రోజుల ముందే ఇక్కడ వచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాలుగుబెడ్స్ వరకు ఉంటాయి. వంట చేసుకునే వీలు కూడా ఉంది. టాయిలెట్స్, వేడి నీళ్లు కూడా అందుతాయి. సహాయకులు కూడా ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. వైద్యులు ప్రతిరోజూ పరీక్షలు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు ప్రసవానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి.
– క్రాంతి కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో