పోక్సో ప్రత్యేక కోర్టులతో లైంగిక దాడి బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి నవీన్రావు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి ఆయన ఆదివారం వరంగల్-హనుమకొండ జిల్లాల కోర్టు భవనాన్ని సందర్శించారు. ఫ్యామిలీ, పోక్సో కోర్టును పరిశీలించారు. అనంతరం జ్యుడీషియరీ ప్రోగ్రాంలో మాట్లాడారు. వరంగల్లో పోక్సో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మిగతా జిల్లాల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాకతీయుల రాజధాని వరంగల్ నగరం గొప్ప చారిత్రక, సాంస్కృతిక సంపదకు నిలయమని కొనియాడారు. కైలాశ్ సత్యార్థి మాట్లాడుతూ పిల్లలపై అఘాయి త్యాల కేసుల పరిష్కార ప్రక్రియ వేగంగా జరుగాలని అన్నారు.
వరంగల్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోక్సో ప్రత్యేక కోర్టులతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని, వరంగల్లో దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. అన్ని జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు న్యాయమూర్తి నవీన్రావు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం వరంగల్-హనుమకొండ జిల్లాల కోర్టు భవనాన్ని సందర్శించారు. ఆధునీకరించిన పోక్సో కోర్టును పరిశీలించారు. అనంతరం జ్యుడీషియరీ ప్రోగ్రాంలో ప్రసంగించారు. కాకతీయుల రాజధాని వరంగల్ నగరం గొప్ప చారిత్రక, సాంస్కృతిక సంపదకు నిలయమని అన్నారు. కైలాశ్ సత్యార్థి పిల్లల హక్కుల కోసం అలుపెరుగని కృషి చేస్తున్న యోధుడని, ఆయన సేవలు చాలా గొప్పవని ప్రశంసించారు. మౌలిక వసతుల కల్పనలో వరంగల్ కోర్టు కాంప్లెక్సు దేశంలోని అన్ని కోర్టులకు స్ఫూర్తిగా నిలిచిందని, అన్ని జిల్లాలకు ఇది మోడల్ కోర్టు అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు అన్నారు.
ఉత్తమ రాష్ట్రం తెలంగాణ: బోయినపల్లి వినోద్కుమార్
తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఎనిమిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో కొత్త మార్గాన్ని చూపిందని తెలిపారు. సాగునీరు, ఉచిత కరంటు వంటివి ఎన్నో ఉన్నాయని… వీటితోపాటు మహిళలు, పిల్లల సంక్షేమం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. వైద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిందని… కేసీఆర్ కిట్తో మాతాశిశు ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతున్నాయని అన్నారు. గతంలో ఎక్కడో ఒక చోట ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవని, రాష్ట్రంలో 495 కస్తూర్బాగాంధీ స్కూళ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. బాలబాలికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 978 రెసిడెన్షియల్ స్కూళ్లు, 97 మైనారిటీ బాలికల స్కూలు, కాలేజీలు, 22 బాలిక కాలేజీలను ప్రభు త్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. మహిళల భద్రత కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా షీటీమ్స్ను ఏర్పాటు చేసిందని, జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి, న్యాయ శాఖ కార్యదర్శి నందికొండ నర్సింగరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ బీ జయాకర్, దుస్స జనార్దన్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ మోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
హైకోర్టు సీజే, కైలాశ్ సత్యార్థికి ఘనస్వాగతం
హనుమకొండ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తి సిహెచ్. నవీన్రావు, నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థిలను నిట్ గెస్ట్హౌస్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్వాగతించారు. జిల్లా కోర్టులో పండితులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. జిల్లా ప్రధాన న్యాయూర్తి రాధాదేవితో పాటు పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లా జడ్జీలు కోక రాధాదేవి, కే క్రిష్ణమూర్తి, బార్ కౌన్సిల్ మెంబర్లు దుస్సా జనార్దన్, బైరపాక జయాకర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, ప్రభుత్వ ప్లీడర్లు శ్యాంసుందర్రావు, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యరదర్శి ఉపేందర్, వరంగల్ సబ్ జడ్జి ఎం. వెంకటేశ్వర్రావు, నగర కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, అడ్వకేట్లు, కళాశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కోర్టు భేష్ : కైలాశ్ సత్యార్థి
పిల్లలపై అఘాయిత్యాల కేసుల పరిష్కార ప్రక్రియ వేగంగా జరగాల్సిన అవసరం ఉన్నదని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. పిల్లలపై వేధింపుల కేసుల పరిష్కారంలో వరంగల్ కోర్టు మెరుగ్గా ఉన్నదని చెప్పారు. వరంగల్ పోక్సో కోర్టులో 256 కేసులు నమోదైతే 146 పరిష్కరించారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 2.5 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడిందని, ఈ విషయంలో వరంగల్ కోర్టు 6 శాతంగా ఉన్నదని చెప్పారు. వరంగల్ కోర్టులో 14 కేసుల్లో దోషులకు శిక్ష పడిందని అన్నారు. దోషులకు శిక్ష వేసే కోర్టులు న్యాయ దేవాలయాలు అని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కోర్టును మోడల్గా పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా నిర్మించాలని అన్నారు. బాధిత పిల్లలను మన పిల్లలుగా భావించి వారిపై వేధింపులు, అఘాయిత్యాలకు ముగింపు పలికేందుకు అందరం బాధ్యత తీసుకోవాలని సూచించారు.
నేటి షెడ్యూల్..
19వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 50 వేల మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కైలాశ్ సత్యార్థి పాల్గొంటారు. ఒంటిగంట నుంచి 2గంటల వరకు భోజనం చేస్తారు. అనంతరం 2.30గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.