ములుగు టౌన్, ఏప్రిల్ 6 : ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు అందించేందుకు జీవో నంబర్ 58, 59 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు నిచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో పాటు 2014 జూన్ 2వ తేదీ లోపు నిర్మించుకున్న ఇళ్లకే అనే నిబంధనను కూడా సవరించింది. 2020 జూన్ 2వ తేదీలోపు ఇళ్లు నిర్మించుకున్నట్లు ఆధారాలు చూపిన వారి ఇళ్లనూ క్రమబద్ధీ కరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నది. గత నెలలో విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మీ సేవ కేంద్రాల్లో తిరిగి పోర్టల్ను ప్రారంభించింది.
ఈ నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఇంతకుముందు దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురైన వారికి కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. దారిద్య్రరేఖకు దిగువ ఉండి 125 గజాల లోపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని నివాసముంటున్న పేదలకు జీవో 58 ద్వారా ప్రభు త్వం ఉచితంగా క్రమబద్ధీకరిస్తున్నది. జిల్లాలో జీవో 58 ద్వారా 111 దరఖాస్తులు, జీవో 59 ద్వారా 146 దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ అధికా రులు దరఖాస్తు దారుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. 2014 జూన్ 2వ తేదీ గడువుగా పెట్టడంతో చాలామంది నష్టపోతున్నారని భావించిన ప్రభుత్వం నిబంధనలను సడలించింది. 2020 జూన్ 2వ తేదీని గడువుగా నిర్ణయించింది.
ఆధారాలు చూపాలి
ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించు కున్న వారు క్రమబద్ధీకరణకు ఆధా రాలు చూపించాల్సి ఉంటుంది ఇంటి పన్ను, ఇంటి నంబరు రసీదు, నల్లా పన్ను, విద్యుత్ బిల్లు, రేషన్, ఆధార్కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను దరఖాస్తుకు జతచేయాలి. 125గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి జీవో 59 ప్రకారం మార్కెట్ ధర లెక్కిస్తారు. 126 నుంచి 250 గజాల వారు రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలి. 251 నుంచి 500 గజాల లోపు అయితే 75 శాతం, 500 గజాలపైన ఉంటే వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య అవసరాల కోసం వాడుకునే స్థలం అయితే రిజిస్ట్రేషన్ ధర చెల్లించాలన్నారు.
30లోపు దరఖాస్తు చేసుకోవాలి
2020 జూన్ 2వ తేదీలోపు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జీవో నంబర్ 58, 59 ద్వారా ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. గతంలో 2014 జూన్ రెండో తేదీని గడువుగా తీసుకున్నారు. దీంతో చాలా మం ది ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన ప్రభుత్వం 2020 జూన్ 2వ తేదీని గడువుగా పెంచింది. ఈ నిర్ణయంతో వందలాది మంది పేదలకు మేలు జరుగనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు గతంలో తిరస్కరణకు గురైన వారు తిరిగి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
– దేవేందర్, ఈడీఎం, ములుగు