ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ హెల్త్సిటీలో కొత్తగా ఫోర్లేన్ రోడ్డు అందుబాటులోకి రానుంది. దవాఖాన ఆవరణలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు ఈ రోడ్డు నిర్మించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వ ఆమోదముద్ర లభించగానే పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. దీని నిర్మాణం పూర్తయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వచ్చే రోగులకు ఎంతో ఉపయోగపడనుంది. వారు నేరుగా ఓపీ ద్వారం వరకు చేరుకొనేందుకు మార్గం సుగమం కానుంది.
వరంగల్, మే 1 (నమస్తే తెలంగాణ) : వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం వరంగల్ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దడానికి పక్కాగా ముందుకు వెళ్తున్నది. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో రూ.1,116 కోట్ల అంచనా వ్యయంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. 56.39 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2,458 పడకల సామర్థ్యంతో 24 అంతస్తులతో నిర్మాణ పనులు గత మే నెల నుంచి శరవేగంగా జరుగుతున్నాయి. మూడు షిప్టుల్లో కార్మికులు నిరంతరం పని చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది. దసరాకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచారు. విద్యుద్దీకరణ, ప్లంబింగ్తో పాటు ఇతర పనులు కూడా జరుగుతున్నాయి. హాస్పిటల్ ఆవరణంలో డ్రైనేజీ, రహదారులు, లాన్ల పనులనూ అధికారులు చేపట్టారు.
మెడికల్ రంగంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే అతిపెద్దది కాబోతుంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఈ హాస్పిటల్ను సందర్శించి పనులను పరిశీలించిన తర్వాత పలు సూచనలు చేశారు. దీంతో ఈ హాస్పిటల్ బెడ్స్ కెపాసిటీ 2,458కి చేరింది. తాజాగా హాస్పిటల్కు రెండో రోడ్డు అవసరమనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్కు చేరుకోవడానికి వరంగల్- హనుమకొండ మెయిన్ రోడ్డు ఒకటే ఉన్నది. ఈ రహదారి నుంచి లోపలకు ప్రవేశించగానే ఎదురుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యవసర ద్వారం, వెనుక వైపున ఓపీ ద్వారం ఉండనుంది. దీంతో అందరూ ఈ రహదారి నుంచే హాస్పిటల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భవిష్యత్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఓపీ ద్వారం కోసం రెండో రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది.
వరంగల్- హనుమకొండ ప్రధాన రహదారిలో ఎంజీఎం సెంటర్ సమీపం నుంచి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ఆటోనగర్, డీఎంహెచ్వో ఆఫీసు మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు డబుల్ రోడ్డు ఉంది. ఇది వరంగల్- ములుగు ప్రధాన రహదారికి చేరుకుంటుంది. ములుగు, భూపాలపల్లి, పరకాల నుంచి వరంగల్ చేరుకునే వాహనాలు ఈ మార్గం ద్వారే నేరుగా ఎంజీఎం సెంటర్కు వస్తాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీని అనుకుని ఉన్న సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. ఆటోనగర్ మార్గంలో ఉన్న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ముందు నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో కేఎంసీ వరకు అర కిలోమీటర్ ఫోర్లేన్ నిర్మించాలని ఆర్అండ్బీ ఇంజినీర్లు ప్రతిపాదించారు. ఇది నిర్మిస్తే హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు, వారి బంధువులు, ఇతరులు ఈ మార్గం ద్వారా ఓపీ ద్వారం చేరుకుంటారని, వరంగల్- హనుమకొండ రోడ్డు నుంచి డాక్టర్లు, సిబ్బంది, సెక్యూరిటీ, అధికారులు, అత్యవసర సర్వీసులను పొందే వారు చేరుకుంటారని తమ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ రెండో రోడ్డు కేఎంసీకి కూడా ఉపయోగపడనుందని తెలిపారు. ఈ కొత్త ఫోర్లేన్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం త్వరలోనే గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.