సీజన్ వస్తున్నదంటే ‘పంట పెట్టుబడి ఎట్ల?’ అన్న బాధ లేదు.. ఎరువులు, విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు.. నీటి కోసం గోస పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.. కరెంటు కోసం రాత్రిళ్లు కూడా కండ్లళ్ల వత్తులేసుకోవాల్సిన అవస్థ లేదు. పండిన పంటను ‘అమ్ముడెట్ల..?’ అన్న రంది లేదు. దుక్కిదున్నేకాన్నుంచి దిగుబడులను అమ్ముకునేదాకా అన్నదాతలకు ఏమేంగావాల్నో అవన్నీ బీఆర్ఎస్ సర్కారు సమకూరుస్తున్నది. ఉమ్మడి పాలనలో కన్నీరు మిగిల్చిన ఎవుసాన్ని స్వరాష్ట్రంలో కనులపండువలా మార్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో పాటు అన్నదాతలతో సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేసింది.
-వరంగల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) వరంగల్ (నమస్తే తెలంగాణ)
వరంగల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్ (నమస్తే తెలంగాణ) : అన్నదాలకు పండుగ వచ్చింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం తెలంగాణ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో సాగు రంగం పురోగతిని గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఎకరాకు సాగునీరందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభు త్వం చేసిన కృషి ఫలించింది. ప్రతి ఊరి చెరువు మండు వేసవిలోనూ నిండుగా ఉన్నది. నిరంతర కరెంటు, పుష్కలంగా ఉన్న నీళ్లతో పంటలు బాగా పండుతున్నాయి.
పండిన పంటను కొనుగోలు చేసేందుకు సొంత ఊరిలోనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెడుతున్నది. దీంతో పంటకు మద్దతు ధర దక్కుతున్నది. పంట సాగుకు అవసరమైన పెట్టుబడిని ‘రైతు బంధు’ రూపం లో సర్కారు ఇస్తున్నది. అదునులో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నది. అన్నదాతలకు అన్ని రకాలుగా అం డగా ఉంటున్న సర్కారు చర్యలతో తెలంగాణ సరికొత్త మాగాణంగా మారింది. తొమ్మిదేండ్ల క్రితం వ్యవసా యం అంటే భయపడే రోజులు ఉండేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయం పండుగైంది. అప్పటి, ఇప్పటి విషయాలను గుర్తు చేసుకునేలా ప్రతి రైతు వేదిక వద్ద కర్యాక్రమాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రైతుబంధుతో ఆర్థిక దన్ను..
రైతుల మేలెంచి ‘రైతుబంధు’ ద్వారా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘పెట్టుబడి’.. అన్నదాతల జీవితాలనే మార్చి వేస్తున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండడం, 24 గంటల పాటు ఉచితంగా కరంటు సరఫరా అవుతుండడం, ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీటి వసతి కలుగడం, అదునుకు సర్కారు సాయం అందుతుండడంతో పంటలు పుట్లకు పుట్లు పండుతుండడం, ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తుండడంతో రైతుల ఆర్థిక పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తున్నది. పెట్టుబడులకు అప్పులు చేసే బాధ తప్పి.. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో సాగు అవసరాలు తీరుతుండగా కర్షకుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఏటా ఉమ్మడి జిల్లా రైతాంగానికి రెండు విడుతల్లో సుమారు రూ.900 కోట్ల మేర పెట్టుబడి సాయం అందుతున్నది.
రైతుబీమాతో ధీమా..
ఏదైనా కారణంతో రైతు చనిపోతే సదరు రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఏ కారణంతో మరణించినా రైతుబీమా ద్వారా రైతు కుటుంబానికి రూ.5లక్షలు అందజేస్తున్నది. ఈ మొత్తాన్ని చనిపోయిన రైతు కుటుంబంలోని నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. దీనిద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కొంత భరోసా లభిస్తున్నది. మేలైన విత్తనాలు, ఎరువులను అందించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను లాభదాయకమైన పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నది.
క్లస్టర్ స్థాయిలో రైతు వేదికలు..
జిల్లాల్లో వ్యవసాయ క్లస్టర్ల స్థాయిలో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. రైతులు ఒకచోట కూర్చుని చర్చించుకునేందుకు వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం రూ.22 లక్షల చొప్పున మంజూరు చేసింది. వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో), రైతుబంధు సమితి కోఆర్డినేటర్కు ఒక్కో గది, రైతుల కోసం ఒక హాలు ఉండేలా ప్రతి రైతువేదికను తీర్చిదిద్దింది. ఏఈవో, రైతుబంధు సమితి కోఆర్డినేటర్తో పాటు రైతులతో సమావేశం నిర్వహించేందుకు రైతువేదికలకు టేబుళ్లు, కుర్చీలను సమకూర్చింది. రైతువేదికల నిర్వహణ కోసం నెలనెలా నిధులు ఇస్తున్నది. ప్రతి క్లస్టర్కు ఒక ఏఈవోను నియమించింది. ఆయా క్లస్టర్ పరిధిలో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటున్నారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం కోసం వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి రైతువేదికను సీరియల్ బల్బులు, పువ్వులు, మామిడి తోరణాలతో అలంకరించారు. వేదికల ఆవరణ, హాలులో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల రైతులు డప్పు, చప్పుళ్లతో ర్యాలీగా రైతువేదిక వద్దకు చేరుకుంటారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం సుమారు రైతులతో అధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా తదితర విశిష్టతలను తెలియజేస్తారు.
క్లస్టర్ పరిధిలో ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు కలిగిన లబ్ధిని వివరిస్తారు. మధ్యాహ్నం రైతులతో సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయా చోట్ల ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, టీ రాజయ్య, శంకర్నాయర్, రెడ్యా నాయక్ రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.