సుబేదారి, ఆగస్టు 27 : ప్రేమ పేరుతో కొందరు.. పరిచయాన్ని ఆసరా చేసుకొని మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్మార్ట్గా వల విసిరి చాటింగ్లతో మొదలుపెట్టి ముగ్గులోకి దింపి అవసరం తీరాక మొహం చాటేస్తున్నారు. ఈ స్నేహం, ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాన్ని తెలుసుకోలేక ఎందరో అమాయకులైన అమ్మాయిలు నిండా మునుగుతున్నారు. తల్లిదండ్రుల అతిగారాబమో, అతి నమ్మకమో, పట్టించుకోనితనం వల్లో యూత్ ట్రాక్ తప్పుతోంది. చివరికి పోలీస్స్టేషన్ మెట్లెక్కి బోరున విలపిస్తూ జరిగిన మోసాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నది. ఇలా ఒకటికాదు రెండు కాదు.. నిత్యం పదులసంఖ్యలో కేసుల దాకా వెళ్తుండగా, పరువుపోతుందని మిన్నకుండిన వారు ఎందరో. అందుకే స్మార్ట్ట్రాప్కు గురికాకండి.. బీ అలర్ట్.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వాడకం అనేది తప్పనిసరిగా మారింది. కానీ అవసరాన్ని మించి వాడకం వలన చెడు దారులు పట్టిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లో యువతి యువకుల మధ్య పరిచయం.. ఇంకేముందు వాట్సాప్లో చాటింగ్లు.. డేటింగ్లు..కొద్దిరోజుల తర్వాత డీప్గా లవ్ చేస్తున్నాని నమ్మించడం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లైంగిక వాంచ తీర్చుకోవడం.. ఆ తర్వాత వద్దులే అని వదిలించుకోవడం.. బాధిత అమ్మాయిలను జీవితాంతం వెంటాడే మానని గాయం.. ఇక మరో విధంగా రిలేషన్స్ పేరుతో, క్లాస్మెట్..ఫ్రెండ్ షిఫ్పేరుతో దుర్మార్గులు స్మార్ట్గా ట్రాప్ చేస్తూ.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వైద్య, ఇంజినీరింగ్, లా, పీజీ, డిగ్రీ ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు కూడా ఏమి ఆలోచించంచకుండా దుర్మార్గుల చేతుల్లో చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొవిడ్ ఎఫెక్ట్తో ఆన్లైన్ క్లాస్ల వల్ల స్మార్ట్ఫోన్ల వాడకం కొందరి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగుచూశాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం, వింత పోకడలు, బిజీ లైఫ్లో పిల్లల పట్ల పేరెంట్స్ దృష్టిపెట్టకపోవడం, హాస్టల్ చదువులు ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. జరిగిన అవమానం, అన్యాయంపై పెదవి విప్పితే పరువు పోతుందని బాధతో ఉన్నవారు మరెందరో బాధితులు ఉండగా, దైర్యంతో ముందుకొచ్చి నిందితులను ఎదిరించి పోరాడి జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నారు మరికొందరు.
ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన కొన్ని సంఘటనలు..
వరంగల్ నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న యువతికి, బీటెక్ చదువుతున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు తన సొంత అన్నకు స్నేహితుడు కావడం, అన్న కోసం తరచూ ఇంటికి రావడం వల్ల ఫ్రెండే కదా అని నమ్మింది. అతడు మొదట్లో చెల్లె అంటూ పిలిచివాడు. కొద్ది రోజుల తర్వాత ఆ యువతిపై కన్నేశాడు. నంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడుతుండేవాడు. ఇది కాస్త ప్రేమకు దారితీసింది. అతడి పుట్టినరోజున ఆ అమ్మాయిని వరంగల్లోని తన ఇంటికి పిలిచాడు. ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లొంగదీసుకున్నాడు. ఇలా చాలాసార్లు కలువడంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఇటీవలే ఆ యువకుడు స్టేషన్ఘన్పూర్లో తన అక్కకు తెలిసిన ఓ హాస్పిటల్లో యువతికి అబార్షన్ చేయించి హాస్టల్కు పంపాడు. యువతి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో సదరు యువకుడి అక్కకు విషయం చెప్పడంతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. అయితే తనకేం సంబంధం లేదని చేతులెత్తేయడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థినికి ఇన్స్టాగ్రామ్లో పెద్దపల్లికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ చేసుకునేవారు. ఫోన్లో మాట్లాడుకునేవారు. కొద్ది నెలల తర్వాత ప్రేమికుడి ఒత్తిడి మేరకు ఒకరోజు ఫోన్ ఇంట్లో పెట్టి రైల్లో పెద్దపల్లికి వెళ్లింది. స్టేషన్లో దిగగానే ఓ ప్రయాణికుడి ఫోన్ నుంచి తన ప్రేమికుడికి ఫోన్ చేసింది. అతడు బైక్పై ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. మరునాడు ఉదయం 6గంటలకు పెద్దపల్లిలో ఆమెను రైలు ఎక్కించాడు. అయితే తల్లిదండ్రులకు భయపడి ఇంటికి వెళ్లకుండా ఆ రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండి మరునాడు వరంగల్కు వచ్చింది. అప్పటికే కూతురి గురించి గాలించి వరంగల్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఆ యువకుడిపై కేసు పెట్టారు.
వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని ఓ కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లో కార్పొరేట్ సంస్థలో మంచి వేతనంతో జాబ్ చేస్తోంది. ఫేస్బుక్లో కరీంనగర్కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వాట్సాప్లో చాటింగ్ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరు ఒకసారి హైదరాబాద్లో కలుసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అతను కూడా హైదరాబాద్లోనే జాబ్లో చేరి వీకెండ్లో ఇద్దరు కలిసి తిరిగేవారు. పెళ్లి చేసుకుందామని అనుకొని ఈ ఏడాది ప్రేమికుల రోజున హైదరాబాద్లోని లాడ్జిలో మూడుసార్లు కలుసుకోగా గర్భం దాల్చింది. ఇప్పుడే పెళ్లి వద్దని ఆ యువకుడు అబార్షన్ చేయించాడు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి గురించి యువతి గట్టిగా అడగడంతో మీ కులం వేరు, ఇంట్లో ఒప్పుకోవడం లేదని తప్పుకున్నాడు. హైదరాబాద్లో అతడు ఉంటున్న అడ్రస్, ఫోన్ నంబర్ మార్చాడు. గత్యంతరం లేక బాధిత యువతి వరంగల్లోని తన కాలనీ పోలీసు స్టేషన్కు వెళ్లింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది.
సుదూర ప్రాంతానికి చెందిన ఓ జిల్లాకు చెందిన యువతి వరంగల్లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఎండీ చదువుతోంది. క్లాస్మేట్(యువతి) ఫ్యామిలీ కారు డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. తనతో ఎండీ చదువుతున్న క్లాస్మేట్ను అప్పుడప్పుడు ఇంటి నుంచి ఆ డ్రైవర్(యువకుడు) కళాశాలలో డ్రాప్ చేయడం కోసం వచ్చేవాడు. ఈక్రమంలో ఆ యువతి కూడా అదే కారులో అప్పుడప్పుడు క్లాస్మేట్తో కలిసి బయటకు వెళ్లేది. అక్క అని పరిచయం చేసుకొని కారు డ్రైవర్ ఆ యువతి సెల్ నంబర్ తీసుకొని మాట్లాడేవాడు. క్లాస్మెట్ కారు డ్రైవరే కదా, ఎప్పడైనా అవసరం ఉంటే కారులో తీసుకెళ్తున్నాడని నమ్మింది. ఇదే అదునుగా ఒకసారి మా ఇంటికి రండి అక్క.. లాంగ్ డ్రైవ్ బాగుంటుంది, గంటలో తిరిగి వద్దామని చెప్పి ఆ యువతిని కారులో దామెర మండలంలోని తన గ్రామానికి సాయంత్రం వేళ తీసుకెళ్లాడు. ఆమెను ఇంటి వద్ద ఉంచి పని ఉందని ఊల్లోకి వెళ్లి రాత్రి 7గంటలకు వచ్చాడు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద లేరు. బాగా చీకటి పడింది, కారు లైట్లు రావడం లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉందామని చెప్పాడు. యువతి నిద్రపోవడంతో అర్ధరాత్రి లైంగిక దాడిచేశాడు. దీన్ని రహస్యంగా తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి మరునాడు ఉదయం కళాశాల ఎదుట వదిలి వెళ్తాడు. కొద్ది రోజుల తర్వాత నీ వీడియో మీ ఫ్రెండ్స్కి పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి నగర శివారులోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి మరోసారి లైంగిక దాడి చేశాడు. మళ్లీ ఆరు నెలల తర్వాత వీడియోస్ డిలీట్ చేస్తానని చెప్పి కారులో రాంపూర్ ఔటర్ రింగ్రోడ్డు వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో మరోసారి మోసం చేశాడు. వీడియో కాల్లో న్యూడ్గా ఉండాలని బెదిరించడం, తరచూ బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా బెదిరింపులకు గురిచేయడంతో బాధిత యువతి భరించలేక ఇటీవల వరంగల్ పోలీసులను ఆశ్రయించింది.
హనుమకొండకు చెందిన 19 ఏళ్ల యువకుడికి నగరంలోని ఆలయానికి వెళ్లినప్పుడు ఓ ఫ్యామిలీ పరిచయం అయింది. అతడు అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లేవాడు. అదే సమయంలో ఆ ఇంట్లో డిగ్రీ చదువుతున్న అమ్మాయిపై కన్నేశాడు. రోడ్డు ప్రమాదంలో ఆమె అన్న కాలికి బలమైన గాయమైందని తెలుసుకొని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అమ్మాయి, ఆమె అన్నయ్య మాత్రమే ఉన్నారు. అయితే బయట ఏమైనా తిందామని నమ్మించి అమ్మాయి అన్నను బైక్పై బయటకు తీసుకెళ్లి ఓ పండ్ల షాపు వద్ద వదిలేసి, తిరిగి ఇంటికి వెళ్లి బైక్పై అమ్మాయిని ఎక్కించుకొని బెదిరించి నగర శివారుకు తీసుకెళ్లాడు. చెట్ల పొదల్లో లైంగిక దాడి చేసి, ఖమ్మం సమీపంలో తన అక్క ఇంట్లో అమ్మాయిని వదిలేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు విషయం తెలుసుకొని అక్కడినుంచి తమ కూతురిని తీసుకొని ఇంటికి వచ్చి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కమలాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్ చదివిన యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. సదరు యువకుడు కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్లో ఉంటూ పీజీ చేస్తున్నాడు. ఇద్దరి విషయం ఇంట్లో తెలియడంతో ఆ యువతిని తల్లిదండ్రులు వరంగల్లోని తమ పెద్ద కూతురు వద్దకు పంపారు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ విషయం తను ప్రేమించిన అబ్బాయికి క్రితమే ఫోన్ చేసి చెప్పింది. దీంతో అతడు వరంగల్ బస్స్టేషన్కు వచ్చి యువతిని బైక్పై తన హాస్టల్కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, యువతి తప్పించుకొని తన గ్రామానికి దగ్గరలో ఉన్న తన పిన్ని ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని తన ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పింది. ఆమె ద్వారా తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసుస్టేషన్లో యువకుడిపై కేసు పెట్టారు.
హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు. వీరి ఏకైక కూతురిని ఉన్నత చదువులు చదివించారు. ఈ మధ్యే ఫారిన్లో ఉన్న యువకుడితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న ఇంటి వారికి ఒక్కడే కుమారుడు(9వ తరగతి). ఈ రెండు సంపన్న కుటుంబాలు ఒకే కాలనీలో ఉంటున్నాయి. అయితే కొద్ది రోజుల నుంచి అమ్మాయి వాట్సాప్ స్టేటస్ ఫొటోలను, సదరు బాలుడు స్క్రీన్షాట్ తీసి న్యూడ్గా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి తిరిగి ఆమెకు వాట్సాప్ పంపేవాడు. ఇది చూసి కంగుతిన్న ఆ యువతి.. ఇంట్లో ఎవరికీ చెప్పలేక మానసికంగా కుంగిపోయింది. అతడి నంబర్ బ్లాక్ చేసింది. అయిన కూడా ఐదు ఫోన్ నంబర్లతో అలాగే న్యూడ్ ఫొటోలు పంపుతూనే ఉన్నాడు. భరించలేక యువతి ఆరోగ్యంగా క్షీణించడంతో తల్లిదండ్రులు ఆరా తీసి విషయం తెలుసుకున్నారు. సైబర్ పోలీసు సహకారంతో ఫొటోలు పంపుతున్న వ్యక్తిని ఫోన్ల నంబర్ల ద్వారా గుర్తించారు. ఇదంతా చేసింది ఫ్యామిలీకి దగ్గ్గరి వ్యక్తేనని, పైగా బాధిత యువతిని అక్క అని ఆప్యాయంగా పిలిచే 9వ తరగతి బాలుడు అని తెలిసి ఇరు కుటుంబాలు వారు నివ్వెరపోయారు. పరువుపోతుందని కేసు పెట్టకుండా ఇద్దరూ రాజీపడ్డారు.
ఆడపిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. వారికి రోజు కొంత టైం కేటాయించి మాట్లాడాలి. స్కూల్, కాలేజీ ఎక్కడైనా సరే ప్రేమ పేరుతో కానీ, లైంగికంగా బెదిరించినపుడు స్వేచ్ఛగా చెప్పుకొనేలా పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి. సమాజంలో జరుగుతున్న మంచి, చెడు గురించి చెప్పాలి. పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుంటూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చెక్ చేయాలి. ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కారణాలు అడిగి తెలుసుకోవాలి. సమస్య ఉంటే వెంటనే హనుమకొండ భరోసా సెంటర్లో ఫిర్యాదు చేయాలి లేదా డయల్ 100కు లేదా షీ టీమ్స్ 7382294058 నంబర్కు ఫోన్ చేయవచ్చు.
– కె.పుష్పారెడ్డి, అడిషనల్ డీసీపీ, క్రైమ్స్, షీ టీమ్స్ ఇన్చార్జి