నయీంనగర్, జనవరి 21 : నిట్లో టెక్నోజియాన్-2024 ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. చివరి రోజు ఆదివారం విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి వాటిని తిలకించారు. చిన్న పడవను రిమోట్తో నియంత్రిస్తూ గమ్యాన్ని చేరుకొనే ‘జహాజ్’ ఎగ్జిబిట్ ప్రదర్శించి, విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.18వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10వేలు అందించారు. రిమోట్ కంట్రోల్డ్(ఆర్సీ) కార్లతో ట్రాక్లో ‘ఆర్సీ రేసింగ్’ ప్రదర్శించారు. కాగా, నిట్లోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టీఎన్ సురేశ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కలలను నిజం చేసుకోవాలని సూచించారు.
కొవిడ్ సమయంలో ఇస్రో చేసిన సేవలను దేశం మరువలేనివన్నారు. ఇస్రోలో పనిచేసేందుకు యువతీ యువకులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. నిట్, ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులు అంతరిక్ష పరిశోధనల్లో గొప్ప పాత్ర పోషించాల్సి ఉందన్నారు. భూగోళంపై మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి తనకు ఇంకా 25 దేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మరో రెండేళ్లలో పూర్తిచేస్తానన్నారు. సబ్మెరైన్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ శాస్త్రవేత్త కావాలని ఆ కాంక్షిస్తున్నానని తెలిపారు. తన భార్య కూడా ఇస్రోలో పనిచేస్తోందని చెప్పారు. విద్యార్థులు ప్యాకేజీలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా దేశాభివృద్ధికి పరిశోధనల గురించి ఆలోచించాలని సూచించారు.