హనుమకొండ చౌరస్తా : గ్రామీణ క్రికెటర్లను (Rural cricketers ) వెలుగులోకి తెచ్చేందుకు జరిగే అండర్-14 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ (Intra-District League) పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ (Secretary Srinivas) తెలిపారు.
జట్లను ఎంపిక చేసే క్రమంలో వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాద్ జిల్లాల జట్ల సెలెక్షన్స్ నిర్వహించామన్నారు. వివిధ జిల్లాల నుంచి 3 వందల మందికిపైగా క్రీడాకారులు పాల్గొనగా ఉత్తమ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఆరు జిల్లాల తుది జట్లను సెలక్షన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో అఫ్జల్, పవన్ ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
ఈనెల 26 నుంచి భూపాలపల్లి జిల్లా సింగరేణి క్రీడామైదానంలో, వంగాలపల్లి డబ్ల్యూడీసీఏ క్రీడా మైదానాల్లో జరిగే లీగ్ కం నాకౌట్ విధానంలో జరిగే ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపిక చేసి అండర్-14 హెచ్సీఏ లీగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, ఉపాధ్యక్షుడు తోట రాము, కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్, వివిధ జిల్లాల కోచ్లు పాల్గొన్నారు.