ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టీ-వాలెట్ త్వరలో అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో వివిధ సేవలు అందిస్తున్నారు. మరోవైపు నిత్యావసర సరుకులను రేషన్ షాపుల్లో ఈ-పాస్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో బోగస్ కార్డులకు చెక్పడింది. ప్రస్తుతం జిల్లాలోని 12 మండలాల్లో 355 రేషన్ షాపుల ద్వారా 1,65,744 మంది లబ్ధిదారులకు బియ్యం ఇస్తున్నారు. మహిళా సంఘాలకు సంబంధించిన నగదు లావాదేవీలు, విద్యార్థుల పరీక్ష ఫీజు, కరంటు బిల్లులు, ఇంటి పన్నులు, ఇతర నగదు రహిత సేవలను టీ-వాలెట్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో విస్తృతంగా పెరుగుతున్న డిజిటల్ సేవలను చౌక దుకాణాల ద్వారా వచ్చే జనవరి నుంచి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
జనగామ, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం ఈ-సేవ, మీ-సేవ కేంద్రా ల్లో లభించే అన్ని సేవలు టీ-వాలెట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కాబోతున్నాయి. గ్రామీణ ప్రజల్లో అక్షరాస్యతను పెంచి ‘డిజిటల్ ఇండియా’లో భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అనేక వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టి పౌరసరఫరాలశాఖ ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో విస్తృతంగా పెరుగుతున్న డిజిటల్ సేవలను రేషన్ దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ఇప్పటికే నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తున్నది. దీంతో లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరైనా స్వయంగా దుకాణానికి వెళ్లి వేలిముద్రలు, ఓటీపీ విధానం ద్వారా బియ్యం, ఇతర వస్తువులు తీసుకోవాలి. దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలు చేయడంతో అసలైన లబ్ధిదారులకు బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.
సరికొత్తగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ-పాస్తో బోగస్ రేషన్కార్డులకు చెక్ పెట్టడంతో నెలానెలా వందల క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. డీలర్ల ఆదాయాన్ని పెంచడం సహా ప్రజలకు ఆన్సేవలను చేరువ చేసేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్న రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఇకపై టీ-వాలెట్ ద్వారా ఈ-సేవ కేంద్రాల్లో లభించే అన్ని రకాల సేవలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన అధికారులు డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో నిపుణులతో రెండురోజుల పాటు ‘ఈ-సేవల’ నిర్వహణపై రేషన్ డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 355 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను 1,65,744 మంది కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ప్రతీనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. ఇకపై 30రోజుల పాటు వాటిని తెరిచి ఉంచి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అదనపు సేవలు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
రేషన్ షాపుల్లో ఈ-సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కేవలం 15 రోజులు మాత్రమే సరుకుల పంపిణీ కోసం రేషన్ దుకాణాలను తెరుస్తుండగా, ఇకపై నెలరోజులు (సెలవు దినాలు మినహా) వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉంటాయి. పౌరసరఫరాశాఖ ప్రజాపంపిణీ ద్వారా అందించే సరుకులు తగ్గి ఆదాయం లేకుండా పోయిందని ఆందోళన పడుతున్న రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఈ-సేవల’ నిర్వహణ అప్పగించి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు రోజంతా చేతినిండా పని కల్పించబోతున్నది. రేషన్ దుకాణాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఈ-సేవల ద్వారా ప్రతి సేవకు డీలర్లకు నిర్వహణ కోసం కమీషన్ రూపంలో చెల్లించబోతున్నది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంత రేషన్ డీలర్లకు ఆదాయం పెరగడంతోపాటు ప్రజలకు వివిధ రకాల పన్నులు చెల్లించడం సులభతరం అవుతుంది.
జనగామ జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఈ-సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఒకటి, రెండు నెలల్లో పథకం అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో మొదటి విడుత, జనవరి మొదటి వారంలో రెండో విడుత జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొదటి విడుతలో జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి మండలాల డీలర్లకు జనగామలో, రెండో విడుతలో స్టేషన్ఘన్పూర్, చిల్పూరు, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల డీలర్లకు స్టేషన్ఘన్పూర్లో జిల్లా పౌరసరఫరాలశాఖ ద్వారా వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా వినియోగదారులకు టీ-వాలెట్ సేవలు ఎలా అందించాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం ఫిబ్రవరి నుంచి రేషన్ దుకాణాల్లో టీ-వాలెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.