పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న వారి నుంచి ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న నలుగురిపై సీపీ కొరడా ఝులిపించారు.
పీడీఎస్ రైస్ అక్రమ రవాణాదారుల నుంచి మామూళ్లు తీసుకున్న ఫలితం
సుబేదారి, జనవరి 9 : పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న వారి నుంచి ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న నలుగురిపై సీపీ కొరడా ఝులిపించారు. టాస్క్ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ వీ నరేశ్కుమార్తోపాటు హెడ్ కానిస్టేబుళ్లు, పీ శ్యాంసుందర్, కే సోమ లింగం, కానిస్టేబుల్, బీ సృజన్పై సీపీ ఏవీ రంగనాథ్ వేటు వేశారు.
పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న నిందితులపై ఎలాంటి కేసులు నమో దు చేయకుండా, వసూళ్లకు పాల్పడడం తదితర కారణాలతో సిబ్బందిపై వచ్చిన ఆరోపణపై పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణ జరిపిం చారు. విచారణలో అక్రమాలు నిర్ధారణ కావడంతో సీఐ, ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘పీడీఎస్ బియ్యం దందాపై సీరియస్’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న వారి నుంచి కొంతమంది పోలీసు అధికారులు, సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నట్లు కొత్త పోలీసు బాస్ దృష్టికి వచ్చింది. దీంతో సీపీ ఏవీ రంగనాథ్ రంగంలోకి దిగారు. పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్న ముగ్గురిని ప్రత్యేక పోలీసు అధికారులు కొద్దిరోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణచేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు వరంగల్కు చెందిన వ్యక్తికి టాస్క్ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న సీఐ, సిబ్బందితో మామూళ్ల సంబంధాలు ఉన్నట్లు తేలింది.
నగర శివారు ప్రాంతానికి చెందిన నిందితుడితో పలువురు లా అండ్ ఆర్డర్ సీఐలకు కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలిసినట్లు తెలిసింది. సీపీ విచారణలో భాగంగా మొదట పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దందాల్లో నిందితుల నుంచి మామూళ్లు తీసుకున్న సీఐ నరేశ్కుమార్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, సోమలింగం, కానిస్టేబుల్ సృజన్పై సస్పెన్షన్ వేటు పడింది. పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి ముడుపులు అందుకున్న వారిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? తర్వాత ఎవరిపై సస్పెన్షన్ వేటు పడుతుంది అనేది చర్చనీయాంశమైంది.