ములుగు, మార్చి 1 (నమస్తేతెలంగాణ): ములుగులాంటి మారుమూల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇంకా ఆటవిక పద్ధతులు కొనసాగుతున్నా.. అవగాహన కల్పించాల్సిన పోలీసులు, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన బంజరుపల్లి ఘటనే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసిన సందర్భంలో కేసులు నమోదు చేసుకొని విచారణను వేగవంతం చేయాల్సింది పోయి పంచాయితీలు పెట్టుకొని పరిష్కరించుకోవాలని పంపుతుండడం విస్తుగొలుపుతున్నది. ముఖ్యంగా ములుగు ఠాణాలో పెద్ద మనుషుల హవా నడుస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
ములుగు మండలం బంజరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అదే గ్రామానికి చెందిన జగన్నాథం నాగయ్య కుల పెద్ద మనుషులను నవంబర్లో ఆశ్రయించాడు. వాళ్లు రెండు, మూడుసార్లు పంచాయితీలు నిర్వహించి డిపాజిట్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సదరు మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ వేడుకున్నా పట్టించుకోలేదు. మంటల్లో వేడి చేసిన గడ్డపారను తీసి శీల పరీక్షలో నెగ్గాలని హుకుం జారీ చేశారు. ఈ మేరకు పెద్ద మనుషుల సమక్షంలో ఈ నెల 25న గంగాధర్ కన్నాయిగూడెం శివారు అటవీ ప్రాంతం వైపు ఉన్న లక్నవరం చెరువు వద్ద ఈ ఘటనకు పూనుకొన్నారు. గడ్డపారను వేడి చేసేందుకు ఆన్లైన్లో 950 పిడకలను తెప్పించారు. అవి నాణ్యతగా లేవని పక్కన పెట్టి వేరే పిడకలను గ్రామాల నుంచి తెప్పించారు. 24న సాయంత్రం గ్రామానికి చెందిన సుమారు 50 మంది వ్యక్తులు పెద్ద మనుషులతోపాటు వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉండి 25న తెల్లవారుజామున 500 పిడకలను కింద పేర్చి మధ్యలో గడ్డపారను నేరం మోపిన నాగయ్యతో పెట్టించి దానిపై మరో 450 పిడకలను పేర్చి నిప్పంటించారు. పిడకలు మొత్తం కాలి బూడిదైన తర్వాత గంగాధర్ చెరువులో మునిగి తడి బట్టలతో వచ్చి గడ్డపారను చేతులతో ఎత్తి బయట వేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత పెద్ద మనుషులు గంగాధర్ చేతులను పరీక్షించి నేరం చేశావు జరిమానా కట్టాలని తీర్పు చెప్పారు. ‘నా చేతులు కాలలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు జరిమానా కట్ట’నని గంగాధర్ తేల్చి చెప్పాడు. అయినా పెద్ద మనుషులు వినకుండా జరిమానా కట్టాల్సిందేనని తీర్పు చెప్పి గ్రామానికి వచ్చారు. గ్రామంలో సైతం ఇదే వ్యవహారంపై తిరిగి ఆదివారం మొత్తం గొడవ జరుగడంతో సోమవారం గంగాధర్ తన భార్యతో కలిసి ములుగు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు.
సోమవారమే ములుగు ఠాణాలో గంగాధర్ ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో విసిగిపోయిన గంగాధర్ తనకు తెలిసిన మీడియా వ్యక్తులను సంప్రదించి విషయాన్ని తెలియజేయగా బుధవారం ఈ ఘటన మొత్తం వీడియో రూపంలో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిని చూసిన ప్రజలు సైతం ఈ కాలంలో ఇలాంటి ఆటవిక చర్య ఏంటని నివ్వేరపోయారు. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాల్సిన పోలీసులు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్థానికులు చర్చించుకున్నారు. ఇప్పటికైనా ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటన రాష్ట్రమంతటా వైరల్ కావడంతో ఎట్టకేలకు గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బుధవారం రాత్రి పోలీసులు తెలిపారు. ఇరు వర్గాల పెద్ద మనుషులైన కుంభం రాములు, జగన్నాథం సుంకయ్య, రాజయ్య, సాంబయ్య, దాసరి గంగయ్య, జగన్నాథం సమ్మయ్య, రాజయ్య, అనుము సమ్మయ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, బాధితుడు ఫిబ్రవరి 27న ఫిర్యాదు చేయగా మార్చి 1న ఉదయం ముట్టినట్లు పేర్కొనడం గమనార్హం.