వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 30 : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు గోపి, రాజీవ్గాంధీహన్మంతు ఆదేశించారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ఎల్అండ్టీ సంస్థ రూ.1,100 కోట్ల వ్యయంతో 26 అంతస్తుల హాస్పిటల్ నిర్మాణ పనులను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు భారీ యంత్రాలు, ఎక్కువ మంది కార్మికులతో పనుల్లో వేగాన్ని పెంచి పూర్తిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పనులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు పునాది పనులు పూర్తయ్యాయని, అన్ని రకాల యంత్ర పరికరాలతో అనుకున్న సమయానికి పూర్తయ్యేవిధంగా పనులు కొనసాగుతున్నాయని వారు జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. ఆర్అండ్బీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.