సుబేదారి, నవంబర్ 2: సరస్సులో ఈతకు దిగి ముగినిపోతున్న స్నేహితుడిని రక్షించబోయి ఉత్తేజ్(27) మృత్యువాత పడ్డాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కుమారుడి మృతితో హనుమకొండలోని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కుంట ఉత్తేజ్ అమెరికాలోని సెయింట్ లూయిస్ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుకునేందుకు ఆగస్టులో వెళ్లాడు. మిస్సోరి స్టేట్ సెయింట్ లూయిస్ ప్రాంతంలో ఉంటున్న ఉత్తేజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి శనివారం విందు చేసుకున్నాడు.
అనంతరం సమీపంలోని సరస్సులో ఈతకు వెళ్లాడు. ముందు తాండూరుకు చెందిన శివదత్త సరస్సులోకి దూకాడు. నీరు గడ్డకట్టి ఈతకు అనుకూలించకపోవడంతో నీటిలో మునుగుతున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ఉత్తేజ్ నీటిలో దిగాడు. నీరు బాగా చల్లగా ఉండడంతో చేతులు ఆడక ఇద్దరు మునిగి చనిపోయారు. ఉత్తేజ్ మృతి సమాచారాన్ని అతడి సోదరుడు, స్నేహితులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి ఎన్ఆర్ఐలతో మాట్లాడి ఉత్తేజ్ మృతదేహాన్ని తానా సంస్థ సాయంతో అమెరికా చికాగో నుంచి వరంగల్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉత్తేజ్ మృతదేహానికి సోమవారం పోస్ట్టుమార్టం నిర్వహించినట్లు మృతుడి బంధువులు తెలిపారు. గురువారం ఉదయం వరకు ఉత్తేజ్ మృతదేహాన్ని వరంగల్కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తేజ్ మృతి వార్తతో తల్లిదండ్రులు జనార్దన్, ఝూన్సీలక్ష్మి, సోదరుడు, అక్క కన్నీరుమున్నీరయ్యారు.