భీమదేవరపల్లి, జూలై 19 : నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల బహుమతుల ప్రదానం, కవుల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మె ల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రచయిత, కవి జయరాజులు ముఖ్యఅతిథులుగా హాజరు కా గా, వందలాది మంది కవులు, రచయితలు, పాఠకులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తం గా సాహిత్యాభివృద్ధి కోసం చేపట్టిన కథల పోటీల ప్రయత్నం అభినందనీయమని పలువురు కవులు పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ఉత్సాహ భరితంగా నడిచింది. సభ లో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ముల్కనూరు ప్రజాగ్రంథాలయం- నమస్తే తెలంగాణ దినపత్రిక సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాన్ని పొగిడారు. ప్రజాగ్రంథాలయానికి కవులు, ఆహుతులు విరాళాలు అందజేశారు. సభ ప్రాంగణం పలుమార్లు చప్పట్లతో మార్మోగింది.
కవుల ఇష్టాగోష్టి కార్యక్రమంలో కవి, రచయిత జయరాజు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు వర్షాలు పడలేదని, నా రైతన్నలు వర్షపు నీటి కోసం ఆకాశం వంక వేచి చూస్తున్నారని ఆవేదన చెందారు. వానమ్మ వానమ్మ ఒక్కసారి వచ్చిపోవే వానమ్మా అంటూ గానం చేస్తుంటే పాల్గొన్న కవులు, రచయితలు మాత్రమే కాకుండా నిర్వాహకుల సైతం హృదయాలు బరువెక్కాయి. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ నాగరాజు, చిల్ల శ్రీనివాస్, ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్రెడ్డి, ముల్కనూరు సాహితీ పీఠం అధ్యక్షుడు వంగ రవి, కార్యవర్గ సభ్యులు పల్లా ప్రమోద్రెడ్డి, గొల్లపల్లి లక్ష్మయ్య, అయిత శ్రీనివాస్, మూల శ్రీనివాస్, ఎదులాపురం తిరుపతి, సుగుణాకర్, మాడుగుల కొంరయ్య, తాళ్ల వీరేశం, కొమ్మిడి గోవర్ధన్రెడ్డి, సుద్దాల సంపత్, నాటరాజ సుందర్, శంకర్రావు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కథల పోటీల్లో ప్రథమ బహుమతి ‘వివర్ణం’ కథనానికి రచయిత పొన్నాడ వెంకట అన్నాజీరావుకు బహుమతి కింద రూ. 50 వేలు, ద్వితీయ బహుమతి ‘కాఫీర్’ కథకు రచయిత సుదర్శనం రంగనాథ్, ‘రా…బంధువు’ కథకు రచయిత సుజన్ కుమార్కు ఒక్కొక్కరికి రూ. 25 వేలు, అలాగే ఐదుగురికి తృతీయ బహుమతి కింద రూ. పదివేల చొప్పున అందజేశారు. అలాగే 18మందికి రూ. 5వేల చొప్పున, 47మందికి రూ. రూ. 3వేల చొప్పున బహుమతులు ప్రదానం చేశారు. విజేతలంరికీ ముఖ్య అతిథులు శాలువాలు కప్పి నగదుతోపాటు మెమెంటోలు ప్రదానం చేశారు.
నేటి తరం యువత పుస్తక పఠనాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత, చదవకముందు ప్రతి ఒక్కరు తమ పరిణతిని పరీక్షంచుకోవాలి. ప్రస్తుత ఆధునిక యుగంలో మనం ఊహిచనంత గొప్పగా ఏఐ అభివృద్ధి చెందుతుంది. మరికొన్నేళ్ల తర్వాత కూడా సాహిత్యం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఆధునికత ఎంత పెరిగినా మనిషి బాధలు, ఆనందాలను కథల రూపంలో తీసుకొచ్చేది సాహిత్యం మాత్రమే. ముల్కనూరు ప్రజాగ్రంథాలయం, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సుమారు 4వేల కథలు వచ్చాయి. అందులో మంచివి ఎంపిక చేసి సుమారు 400 కథలకు బహుమతులు అందజేశాం.
– వేముల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ