హనుమకొండ, జూలై 16 : ‘నిజాం కాలంలో నిర్మించిన మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. 60 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ దానిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది’ అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్పోర్టు ప్రాముఖ్యతను వివరించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉడాన్ పథకం అమలువుతున్న సమయంలో సైతం కేంద్రంతో నిరంతరం చర్చలు జరిపిన ఘటనలున్నాయని, ఈ క్రమంలో ఎయిర్పోర్టు అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని దాస్యం పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1.8 కిమీటర్ల ఉన్న రన్వేను 3.8 కిలోమీటర్లు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించామని, ఇందుకోసం స్థానిక రైతులను ఒప్పించి భూ సేకరణ చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉకు కర్మాగారం వంటి హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ మధ్య ఉన్న ఒప్పందం కారణంగా 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకులున్నాయని, ఆ అంశంపై కేసీఆర్, కేటీఆర్ జీఎంఆర్ ప్రతినిధులతో చర్చించి ముందడుగు వేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొననివారు, అవగాహన లేనివారు వరంగల్ అభివృద్ధిని తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతామని దాస్యం స్పష్టం చేశారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు లలితా యాదవ్, మసూద్, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, నార్లగిరి రమేశ్, నయీముద్దీన్, జోరిక రమేశ్, బండి రజనీకుమార్, వనంరెడ్డి, శ్రీధర్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తయారు చేసిన మైనపు బొమ్మ సీఎం రేవంత్రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదు. భూ సేకరణకు అనుమతులిచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. దేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలించినప్పటికీ మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధిని ఎందుకు చేపట్టలేదు. సీఎం రేవంత్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బీఆర్ఎస్పై చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అటకెక్కించింది. మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు పునాది వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
సీఎం రేవంత్రెడ్డి 73 సార్లు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణకు ఒరిగింది శూ న్యం. మామునూరు ఎయిర్పోర్టు విషయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్పోర్టు కోసం క్యాబినేట్ ఆమోదంతో 253 ఎకరాల భూ సేకరణ పూర్తిచేశాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పార్లమెంట్లో పలుమార్లు మామునూరు ఎయిర్పోర్టు అం శాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, నెల్లూరు, కడపలో ఎయిర్పోర్టులు నిర్మించినప్పటికీ మామునూరు విషయంలో చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రూ. 500 కోట్లతో భూసేకరణ చేపట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించించగా, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో నియామకాలు నిలిచిపోయాయి. రేవంత్రెడ్డి టీడీపీకి ప్రతిరూపమైతే నాయిని రాజేందర్రెడ్డి రేవంత్కు ప్రతిరూపం.
– అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే