పరకాల, మార్చి 22 : పరకాల ఆర్టీసీ డిపో తరలిపోకుండా చర్యలు చేపట్టినట్లు, వారం రోజుల్లోనే రూట్ల పునరుద్ధరణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు, పట్టణ బీఆర్ఎస్ నాయకులతో బుధవారం పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో డిపో పరిధిలోని పలు రూట్లను రద్దు చేశారని, త్వరలోనే అన్ని రూట్లను పునరుద్ధరించడంతోపాటు మరిన్ని లాభదాయక రూట్లలో కొత్త బస్సులను నడుపుతామని తెలిపారు. హనుమకొండ, హైదరాబాద్, అంబాల పెద్దాపూర్ వరంగల్, కాళేశ్వరం, భూపాలపల్లి, హుజూరాబాద్ రూట్లలో మరిన్ని బస్సులను ఆర్టీసీ ఆధికారులు నడిపే విధంగాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిపో, రూట్ల విషయాన్ని ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్, మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
డిపో తరలిస్తున్నారని కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. డిపో తరలిపోయే ప్రసక్తి లేదని, రానున్న కొన్ని రోజుల్లోనే మరిన్ని నూతన బస్సులు డిపోకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమీక్షలో ఆర్టీసీ వరంగల్ రీజియన్ డిప్యూటీ ఆర్ఎం కృపాకర్ రెడ్డి, డిపో మేనేజర్ కృష్ణ మూర్తి, ఏసీపీ జూపల్లి శివరామయ్య, పరకాల, పరకాల రూరల్ సీఐలు పుల్యాల కిషన్, శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోదా రామకృష్ణ, మడికొండ శ్రీను, గంట కళావతి, బండి శ్రీధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.