హనుమకొండ, మార్చి 8: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోళికేరి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అవార్డు గ్రహీతలతో కలిసి మంత్రులు, చీఫ్ విప్, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాణీరుద్రమదేవి నడయాడిన నగరం, ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బిడ్డగా, చెల్లిగా, తల్లి అనేక పాత్రలు పోషిస్తూ, మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మహిళా అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. షీ టీమ్స్, భరోసా, సఖీ సెంటర్లు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700అంగన్వాడీ సెంటర్ల ద్వారా సేవలు అందుతున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో సరైన పెరుగుదల, బరువు కోసం బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు రూ.12వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ ద్వారా అందిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 13,90,639 మంది లబ్ధిపొందగా ప్రభుత్వం రూ.1261.67కోట్లు వెచ్చించిందని వెల్లడించారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకం కింద విడుతలవారీగా పోషకాహార కిట్లను అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బిడ్డ పుట్టక ముందు న్యూట్రీషన్ కిట్, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు నుంచి 61శాతానికి పెరిగాయన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఆడపిల్లలకు మేనమామగా మారగా బాల్య వివాహాలు కూడా తగ్గాయని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సుమారుగా 4లక్షల మంది బాలికలు చదువుతున్నారని తెలిపారు. మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోళికేరి మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు స్థాయి మహిళా దినోత్సవాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి అధికారికంగా మహిళా దినోత్సవం నిర్వహించడంతోపాటు అవార్డులు ప్రదానం చేస్తోందని పేర్కొన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కోసం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
కాకతీయ యూనివర్సిటీకి గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు ఒకటి చొప్పున మంజూరు చేస్తున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. ఒక్కోదానికి రూ.10కోట్ల చొప్పున రూ.20కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే మహిళా దినోత్సవం వరకు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీలో చదవాలనే డ్రీమ్ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అది తనకు దక్కలేదని, ఇప్పుడు మంత్రిగా వచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఘటన దురదృష్టకరమని అన్నారు. మహిళలు ధైర్యం కోల్పోకుండా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు రక్షణ కవచంగా నిలుస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కేయూ వీసీ టి.రమేశ్, చైర్మన్లు ఎం.సుధీర్కుమార్, జి.జ్యోతిబిందు, మేయర్ రిజ్వాన శమీమ్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, సంగీత నాటక అకాడమి చైర్మన్ దీపికారెడ్డి, డాక్టర్ హరి రమాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అవార్డు గ్రహీతలు, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ‘ఆరోగ్య మహిళా’ కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు 5 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేయగా, జిల్లాలోనూ ఐదు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిల్లో ప్రతి మంగళవారం మహిళలకు ఎనిమిది రకాల ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రంగా ఉంటే ప్రభుత్వ పెద్దాస్పత్రులకు రెఫర్ చేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను గుర్తించి ఏటా అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది మహిళలను కమిటీ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు మహిళలకు అవార్డులు అందించిన దాఖలాలు లేవన్నారు. ఎంపికైన వారిని సత్కరించడంతోపాటు మెమోంటో, ప్రశంసాపత్రం, లక్ష రూపాయల చొప్పున చెక్కు అందజేశామన్నారు.