ఖిలావరంగల్, మార్చి 18: గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణరక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, వరంగల్ మహానగర పాలకసంస్థ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కలెక్టర్ పీ ప్రావీణ్యతోపాటు అధికారులకు సీపీఆర్ ఎలా చేయాలనే అంశాలపై డీఎంహెచ్వో కే వెంకటరమణ వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టు ద్వారా గాలిలో కలిసిపోతున్న ప్రాణాలను రక్షించేందుకు సీపీఆర్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. గుండెపోటు వచ్చిన వారికి సత్వరమే ప్రాథమిక చికిత్స అందించాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాకు చెందిన నలుగురు వైద్యాధికారులు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలిపారు. వీరు ప్రతిరోజూ 60 మందికి సీపీఆర్పై శిక్షణ ఇస్తారన్నారు. తొలి విడుత వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ ఉంటుందని వివరించారు. తర్వాత ప్రజలతో మమేకమై ఉండే శాఖలకు చెందిన అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు సీపీఆర్పై శిక్షణ ఇప్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్కు సూచించారు.
సీపీఆర్ శిక్షణ నిర్వహించే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరుగురు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లే వాహనదారులకు కూడా శిక్షణ ఇప్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గుండె పోటు వచ్చిన వెంటనే పక్కనే ఉన్నవారు 108 అంబులెన్స్కు ఫోన్ చేస్తూనే సీపీఆర్ చేయాలన్నారు. వార్డు, గ్రామాల స్థాయిలో ప్రతిఒక్కరికీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శిక్షణ తీసుకున్న ఒక్కరు మరో పది మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రజల ఆరోగ్యంపై సీఎం కే చంద్రశేఖర్రావుకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. రూ.1100 కోట్లతో చేపట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
చిన్న పిల్లల నుంచి వృద్ధులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కేసీఆర్ కిట్తోపాటు మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతోనే ప్రభుత్వ దవాఖానల్లో 95 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ సీపీఆర్ చేయడం నేర్చుకోవడం మంచి పరిణామన్నారు. రోడ్ల మీదకాని ఇతర ప్రాంతాల్లో గుండెపోటు వచ్చినప్పుడు పైసా ఖర్చు లేకుండా అప్పటికప్పుడు ప్రాణాలు కాపాడవచ్చన్నారు. పోలీసు శాఖలో ప్రతి ఒక్కరిని సీపీఆర్ శిక్షణకు పంపిస్తానన్నారు. ఆటో డ్రైవర్లతోపాటు ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ, ఏవో శ్రీకాంత్, ఈడీఎం రాజ్కుమార్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.