కరీమాబాద్, జనవరి 8: కాకతీయ ప్రీమియర్ లీగ్(కేపీఎల్) సీజన్ వచ్చిందంటే చాలు క్రీడాభిమానులకు పండుగే. నువ్వా, నేనా అన్నట్లుగా సాగే పోటీలు ఆనందంతో పాటు ఆసక్తిని కలిగిస్తాయి. హోరాహోరీగా సాగే తెలంగాణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కరీమాబాద్లోని రామస్వామి గుడి మైదానం సిద్ధమవుతుంది. ఈ నెల 10న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేతుల మీదుగా పోటీలను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్లాసిక్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 32 జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి.
అందుకోసం గాను నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. కాకతీయ ప్రీమియర్ లీగ్(కేపీఎల్) పేరుతో 12 ఏండ్లుగా నిర్వాహకులు కరీమాబాద్లోని రామస్వామి గుడిలో పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలు తిలకించేందుకు క్రీడాభిమానులు సైతం భారీగా తరలిరానున్నారు. సుమారు 20 రోజుల పాటు క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. కాగా, పోటీల్లో గెలిచిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.60 వేలతో పాటు ట్రోఫీ, ద్వితీయ బహుమతిగా రూ.30వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు, నాలుగో బహుమతిగా రూ.10వేలతోపాటు ట్రోఫీలు అందజేస్తామని క్లాసిక్ క్రికెట్ క్లబ్ చైర్మన్ అక్తర్ తెలిపారు. రోజు 4 మ్యాచ్లు ఉంటాయని, ప్రతి మ్యాచ్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక బహుమతి ఉంటుందని పేర్కొన్నారు.