కులవృత్తులు, చేతివృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ తాజాగా చేనేత మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టగా, వారి ఖాతాల్లో ప్రతి నెలా రూ.3వేల చొప్పున జమచేయనుంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.25వేల విలువైన వైద్యం అందిచనుంది. వరంగల్ జిల్లాలో 2,500 మందికి లబ్ధి చేకూరనుంది. మంగళవారం జిల్లాలో పలుచోట్ల కార్మిక కుటుంబాలు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేస్తున్నారు.
వరంగల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కులవృత్తులు, చేతివృత్తులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. గొల్లకురుమలకు యూనిట్ కాస్ట్పై 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తున్నది. మత్స్యకారులకు ఏటా 100 శాతం సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలను అందజేస్తున్నది. చేనేత కార్మికుల కోసం నేతన్నకు చేయూత, చేనేత బీమా తదితర పథకాలను అమలు చేస్తున్నది. వీటికి తోడు తాజాగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం మరిన్ని వరాలు ప్రకటించారు. దీంతో చేనేత కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
మంత్రి కేటీఆర్ వరాలపై చేనేత కార్మికులు సంబురాలు జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. మంగళవారం వరంగల్లోని కొత్తవాడ జంక్షన్లో చేనేత కార్మికులతో కలిసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చేనేత మిత్ర పథకం ద్వారా మగ్గం కార్మికులకు నెలనెలా రూ.3 వేల ఆర్థిక సాయం అందించడానికి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చేనేత కార్మికుల పట్ల గొప్ప మనసు చాటుకున్నది. కులమతాలకతీతంగా అన్ని వర్గాలను కాపాడుకునేదే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణితో పాటు బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ సోమవారం చేనేత కార్మికులపై వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు కంటి, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటికి ఆరోగ్య కార్డు ద్వారా చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేల వరకు వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా క్యాష్ క్రెడిట్ను రూ.200 కోట్ల వరకు అందజేయనున్నట్లు చెప్పారు. చేనేత మిత్ర పథకం ద్వార నూలు, రంగులు, రసాయనాల కోసం ఇక నుంచి మగ్గం మీద పని చేసే ప్రతి కార్మికుడికి నెలకు రూ.3 వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ పేరుతో తక్షణమే దీన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతమందికి ప్రయోజనమంటే…
జిల్లాలో 28 చేనేత సహకార సంఘాలు ఉండగా 1,400 మంది చేనేత కార్మికులు, 1,100 మంది అనుబంధ కార్మికులు ఉన్నట్లు చేనేత, జౌళి శాఖ అధికారులు తెలిపారు. ఈ 2,500 చేనేత, అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం వర్తించనున్నది. వీరికి ప్రతి నెల ప్రభుత్వం ఈ పథకం ద్వారా రూ.3 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నది. కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందనున్నాయి. చేనేత సహకార సంఘాలకు వ్యాపార కార్యక్రమాల నిర్వహణ కోసం క్యాష్ క్రెడిట్ అందనున్నది.
తెలంగాణ చేనేత మగ్గం ద్వారా నేతన్నలు కొత్తగా ఫ్రేమ్ మగ్గాలను పొందనున్నారు. చేనేత కళను ఆదుకోవాలంటే ఆధునీకరణ అవసరమని, గుంట మగ్గాల స్థానంలో కొత్త పథకం ద్వారా ఫ్రేమ్ మగ్గాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో 10,652 ఫ్రేమ్ మగ్గాలను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి వల్ల కార్మికుల అనారోగ్య సమస్యలు దూరమవ్వడంతో పాటు వారి శ్రమ తగ్గి నాణ్యమైన చేనేత వస్ర్తాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
చేనేత బీమాకు త్రిఫ్ట్ పథకాన్ని లింక్ చేసి 75 ఏండ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. దీంతో సుమారు 1,100 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ప్రస్తుతం 18 నుంచి 59 ఏండ్ల కార్మికులకు చేనేత బీమా పథకం వర్తిస్తున్నది. దీనికి త్రిఫ్ట్ పథకాన్ని లింక్ చేయడం వల్ల 60 నుంచి ఆపై బడిన వయసు గల 1,100 మందికి లబ్ధి చేకూరనున్నది. నేతన్నకు చేయూత పథకం కోసం జిల్లాలో 1,830 మంది కార్మికులు పొదుపు చేస్తున్నారు. తమ వేతనంలో 8 శాతం డబ్బును పొదుపు ద్వార ప్రతి నెల బ్యాంకులో జమ చేస్తున్నారు.
ప్రభుత్వం రెండింతలు అంటే 16 శాతం డబ్బును జమ చేస్తున్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కింద ఏటా ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అవార్డుకు జిల్లా నుంచి ఈ ఏడాది ఇద్దరు చేనేత కార్మికులు ఎంపికైనట్లు చేనేత, జౌళిశాక సహాయ సంచాలకుడు జీ రాఘవరావు చెప్పారు. వరంగల్లోని కొత్తవాడకు చెందిన కందగట్ల రమేశ్, నామని రవీందర్ ఈ అవార్డు కింద సోమవారం రూ.25 వేల చొప్పున నగదు అందుకున్నట్లు ఆయన తెలిపారు. డర్రీపైన వివేకానందుడు, బుద్ధుడి బొమ్మలను వేయడం ద్వారా వారికి అవార్డు దక్కినట్లు వెల్లడించారు.