హనుమకొండ, డిసెంబర్ 31 : ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడే రెడ్క్రాస్కు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం సుబేదారిలోని రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో తలసేమియా బాధితుల కోసం మొదటి అంతస్తు నిర్మాణ పనులకు పాలకవర్గం భూమి పూజ నిర్వహించింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి నిర్వహించే అధికారిక కార్యక్రమం తలసేమియా వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రక్తదానమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్క్రాస్ అభ్యున్నతికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా హనుమకొండ శాఖను నిలిపిన పాలకవర్గాన్ని అభినందించారు. కాగా, నివాస స్థలాలు ఇప్పించాలని రెడ్క్రాస్ సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్, రెడ్క్రాస్ ప్యాట్రన్ ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయచందర్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్ రావు, జిల్లా సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, డాక్టర్ ఎం శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్రావు, డాక్టర్ కే సుధాకర్రెడ్డి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, కార్పొరేటర్ గుజ్జుల వసంత పాల్గొన్నారు.