నయీంనగర్, మార్చి 6: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ-2023 థీమ్ ‘కళాధ్వని’ని సోమవారం ఆవిష్కరించారు. విద్యార్థుల సమక్షంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఆవిష్కరించారు. ఉత్సాహంగా సాగే ఈ వేడుక థీమ్ అయిన కళాధ్వనిలో సంస్కృతి ప్రతిధ్వనిస్తోంది. మన దేశంలో కనిపించే విభిన్న కళారూపాలు, శబ్దాలను ప్రతిబింబిస్తున్నది. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో జరిగే స్ప్రింగ్ స్ప్రీలో నృత్యం, సంగీతం, థియేటర్ కళ, సాహిత్యం, క్రీడలతోపాటు వివిధ రకాల ప్రదర్శనలతో సహా అనేక రకాల ఈవెంట్స్, పోటీలు ఉంటాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది పాల్గొంటారు. సాంస్కృతిక మార్పిడి, అభ్యాసానికి ఒక అద్భుతమైన అవకాశం, ఉత్తేజకరమైన ఈవెంట్స్, యాక్టివిటీల లైవ్షోలు మరుపురాని అనుభూతిని ఇస్తాయి. కాగా, సోమవారం రాత్రి విద్యార్థులు ఫ్లాష్మాబ్లో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హిరాలాల్ పాల్గొన్నారు.
ర్యాగింగ్ చేయొద్దు : ఏసీపీ శ్రీనివాస్
నిట్ స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడొద్దని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం నిట్లో నిట్ డైరెక్టర్ ఎన్వీరమణారావుతో సమావేశమయ్యారు. వేడుకల్లో విద్యార్థులు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. విద్యార్థుల హాస్టళ్లను సందర్శించి, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సీఐ మహేందర్, ఎస్సై శ్వేత, ఎన్సీసీ ఆఫీసర్ హరి, మురళీమోహన్ పాల్గొన్నారు.