ములుగు, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ) : మేడారం మహా జాతర సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో కూడిన ప్రత్యేక ఆహ్వానాన్ని సిద్ధం చేసింది. ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ను తయారు చేసి ఇందు లో కాఫీ టేబుల్ బుక్ , కోయ, గోండ్ పెయింటిం గ్స్, నాయకపు గిరిజన దారు శిల్పాలు, ఓజా గోండ్ క్రాప్ట్స్, బంజారా క్రాప్ట్స్, సమాచార స్టికర్లను అమర్చారు. సమ్మక-సారలమ్మ జాతర ప్రత్యేకత తెలిసేలా ఈ గిఫ్ట్ బాక్స్ తయారు చేశారు. ఇందులో 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 తేదీల మధ్య జరిగే జాతర రోజువారీ కార్యక్రమాల వివరాలు పొందుపర్చారు. కాఫీ టేబుల్ బుక్ గిఫ్ట్ బాక్స్ దీని ప్రధాన ఆకర్షణ. ఈ ఆహ్వాన పత్రికలో తెలంగాణ గిరిజనుల జీవన సంసృతికి సంబంధించిన ఆకర్షణీయమైన చిత్రాలతో పొందుపర్చారు. గిఫ్ట్ బాక్స్లో అందమైన ఫ్రేమ్లలో అమర్చిన కోయ లేదా గోండ్ పెయింటింగ్లు ఉండనున్నాయి. నాయకపు గిరిజన కళాకారులు ప్రత్యేకంగా రంగురంగులతో తయారుచేసిన శిరస్సు లు అనే దారు కళాఖండాలనూ ఈ బాక్స్లో అమర్చారు. అదేవిధంగా మైనపు సాంకేతికతతో ఓజా గోండ్స్ తయారు చేసిన ఇత్తడి క్రాఫ్ట్ తాబేలు కూడా బాక్స్లో ఉంచారు. లంబాడా స్త్రీలు నేసిన బంజారా హస్తకళ, పొట్లీ, పౌచ్, సమ్మక పవిత్రమైన పసుపు పొడితో పెట్టెలో అమర్చారు. దేశంలోని వివిధ రాష్ర్టాల సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, వీవీఐపీలను ఆహ్వానించడానికి ఈ అమూల్యమైన గిఫ్ట్ బాక్స్ను గిరిజన సంక్షేమ శాఖ అందజేసి మహా జాతరకు ఆహ్వానించే ఏర్పాట్లు చేసింది.