వరంగల్ చౌరస్తా, మే 7 : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో ప్రత్యేక ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు కానుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు హాస్పిటల్కు మరో ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీ సీట్లను మంజూరు చేసిన నేపథ్యంలో క్యాజువాలిటీ విభాగాన్ని విస్తరించాలని వైద్యాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో క్షతగాత్రులకు 24గంటల పాటు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ల్యాబ్, ఈసీజీ విభాగాలతో పాటు పోలీస్ ఔట్ పోస్టులో మార్పులు చేసేందుకు దవాఖాన వైద్యాధికారులు నిమగ్నమయ్యారు.
ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్య ప్రదాయిని వరంగల్ ఎంజీఎం దవాఖానలో అత్యవసర వైద్య విభాగం సేవలు మరింత విస్తృతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. మార్చి 13వ తేదీన నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు హాస్పిటల్ను సందర్శించారు. అత్యవసర వైద్య విభాగంలో అందుతున్న సేవలు, ఆపరేషన్ థియేటర్, ఆర్ఐసీయూ విభాగం, వైద్య వసతులు, సిటీ స్కాన్, ఎక్స్రే, ఈజీసీ యంత్ర పరికరాలను పరిశీలించారు. ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీ సీట్లను మంజూరు చేస్తూ మార్చి 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో ఈ సీట్లను భర్తీ చేయనున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం 25 పడకలతో కొనసాగుతున్న క్యాజువాలిటీ విభాగం నిత్యం రద్దీగా ఉండడంతో దీన్ని విస్తరించడానికి వైద్యాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రత్యేక ఎమర్జెన్సీ విభాగం ప్రారంభిస్తే రోగులు, క్షతగాత్రులకు 24గంటల పాటు వైద్యసేవలు అందుతాయి. ప్రస్తుతం క్షతగాత్రులు, రోగులు ఎక్కువ సమయం క్యాజువాలిటీ వార్డులోనే ఉండాల్సి వస్తున్నది. భారీ ప్రమాదాలు సంభవించినపుడు క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల క్యాజువాలిటీ విభాగంలో పడకలు సరిపోకపోవడం, ప్రముఖులు, రాజకీయ నాయకులు రోగులను పరామర్శించడానికి వచ్చిన సందర్భాల్లో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాజువాలిటీ విభాగంలోని ల్యాబ్, ఈసీజీ విభాగాలతో పాటు పోలీస్ ఔట్ పోస్టులో మార్పులు చేపట్టి విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వార్డు విస్తరిస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి వీలుకలుగుతుందని పలువురు విభాగాధిపతులు, వైద్యులు, రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విస్తరణకు చర్యలు చేపడతాం
క్యాజువాలిటీ విభాగాన్ని విస్తరించడానికి చర్యలు చేపడతున్నాం. భారీ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాత్రులు, రోగులకు సరిపడా సౌకర్యాలు లేక ఇబ్బంది కలుగుతున్నది. రానున్న రోజుల్లో అత్యవసర మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున విస్తరణ పనులు తప్పనిసరి. ల్యాబ్, ఈసీజీ, ఎక్స్రే విభాగాలను కూడా ఆధునీకరిస్తాం. రోగులకు వైద్యసేవల్లో ఆటంకం కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్