ఆయన మొక్కల పెంపకంలో ఆరితేరిన తోటమాలి.. మొక్క దశ నుంచి చెట్టయి ఫలాలనిచ్చేదాకా ప్రతి దశపై పూర్తి పట్టున్న వ్యక్తి. వివిధ రకాల తెగుళ్ల నివారణ కోసం పురుగు మందుల వాడకంలో శాస్త్రవేత్తకు ఏమాత్రం తీసిపోకుండా సలహాలు ఇవ్వగల నేర్పరి. సాయం కోరి వచ్చే రైతులకు తోటల పెంపకంలో చేదోడువాదోడుగా ఉండే ఉపకారి. మొక్కలు, చెట్లకు ఏ చీడపీడ పట్టినా వెంటనే గుర్తొచ్చే పేరు షేక్ అల్లాబక్ష్. నాలుగున్నర దశాబ్దాలుగా మొక్కలే ప్రపంచంగా బతుకుతున్న ఈ వృక్ష నిపుణుడు తన అనుభవాలను, సలహాలను పంచుకునేందుకు ఇలా మనముందుకొచ్చాడు.
– వరంగల్, జనవరి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
45ఏండ్లుగా ఇదే మొక్కల పెంపకంలోనే..
మా నాన్నతోనే నేను ఈ రంగంలోకి వచ్చిన. బైపీసీ తర్వాత ఎంసెట్ రాసిన. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేరాలంటే లక్ష రూపాయలు. కేఎంసీలో మూడు లక్షల ఫీజు అయినా సరే చేరు అని నాన్న చెప్పిండు. కేఎంసీలో అలా చేరే అవకాశం లేదు. ఎంసెట్లో మంచి ర్యాంకు కోసం మరోసారి ప్రయత్నించిన. మళ్లీ పాత రిజల్టే వచ్చింది. మాకు లారీలు, ఇతర వ్యాపారాలు ఉండేవి. డాక్టర్ అయ్యే అవకాశం పోయిందని మాకున్న వ్యాపారంలో ఉపయోగపడుతుందని బీకాంలో చేరిన. కేడీసీలో ఫస్ట్ ర్యాంకు నాదే.
ఆ తర్వాత మెల్లగా నాన్నతో కలిసి నర్సరీలోకి వచ్చిన. ఈ పనిలో చాలా సంతృప్తి అనిపిస్తది. మా నాన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మొక్కలతో లక్ష ఎకరాలపైన విస్తీర్ణంలో తోటలు పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతి మండలానికి మా మొక్కలు చేరాయి. చాలా మంది పెద్ద రైతులు, చిన్న రైతులకు మేం మొక్కలు సరఫరా చేసినం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద స్థాయి అధికారులు చాలా మంది మా నర్సరీ నుంచి తీసుకెళ్లిన మొక్కలతోనే తోటలు పెట్టారు. వాళ్లు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. నర్సరీతోపాటు మొక్కల సంరక్షణ కోసం ఉపయోగించే మందులపై ఆసక్తి ఉండేది.
ఎరువులు, పురుగుమందుల రంగంలో పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. ఏటా కొత్త రకమైన మందులు వస్తున్నాయి. రెండు వేర్వేరు మందులు కొట్టే బదులు ఒకే దాంట్లో రెండు ఫార్ములాలు ఉంటున్నాయి. రైతులు పోయిన ఏడాది కొట్టిన మందు కదా అని ఇప్పుడు వాడడం కాకుండా.. ఎప్పటికప్పుడు మార్కెట్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవాలి. కొంచెం అవగాహనతో ఉంటే తక్కువ ఖర్చుతో పంటలను కాపాడుకోవచ్చు. ఈ ఆసక్తితోనే అన్ని మందుల గురించి తెలుసుకుంటా. రైతులు అడిగినప్పుడు పంట ఎలా ఉందో తెలుసుకొని నా అనుభవంతో ఏం వాడాలో చెబుతాను. తోటలు బాగున్నాయని, ఆదాయం వస్తున్నదని చెబుతుంటారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా చెబుతారు. నాకున్న అనుభవంతో వారికి ఏం చేయాలో సలహాలిస్తాను. ఫలితం కనిపిస్తే మళ్లీ నాకు ఫోన్ చేసి బాగైందని చెబుతుంటారు. అప్పుడు చాలా తృప్తి అనిపిస్తది.
‘స్వాతంత్రానికి ముందు నుంచే మా కుటుంబం మొక్కల పెంపకం, నిర్వహణలో ఉన్నది. మా నాన్న ఈ రంగలోకి వచ్చారు. ఇప్పుడు ఎస్2 మాల్ ఉన్న జాగలో మా నర్సరీ ఉండేది. మార్కెట్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి రైతు వచ్చే ప్రాంతం ఇది. పండ్లు, పూలు, అలంకరణ మొక్కలు ఏవి కావాలన్నా మా నర్సరీలో అందుబాటులో ఉంటాయి. ఆసియా దేశాల్లో ఉండే ప్రతి మొక్క మా దగ్గర ఉంటుంది. ఇతర మొక్కలు కావాలంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే మొక్కలను పెంచుకోవాలని చెబుతుంటా. దీని వల్ల మొక్కలను పెంచే వారికి ఇబ్బంది ఉండదు. మాకు మామిడి తోటలున్నాయి. ఇంకొన్ని పండ్ల మొక్కలున్నాయి. నా అనుభవంతో నే మొక్కలు, చెట్ల సంరక్షణ, పంట వచ్చేందుకు సలహాలు ఇస్తుంటా. ఎన్ని ఉన్నా వ్యవసాయంతో వచ్చే ఆదాయాన్ని చూస్తే తృప్తి కనిపిస్తున్నది. పంట పండించే వాళ్లు దాన్ని అమ్ముకునేందుకు ఎవరికీ అబద్ధాలు చెప్పరు. వ్యవసాయ ఆదాయం స్వచ్ఛమైనది.
ఉమ్మడి జిల్లాలో ఎవరు తోటలు పెట్టాలనుకున్నా షేక్ అల్లాబక్ష్ సలహాలు తీసుకుంటారు. ఆయన నర్సరీలో మొక్కలను అమ్మడం వరకే ఆగిపోకుండా రైతులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. మేలైన మొక్కలు సరఫరా చేయడమే కాకుండా వాటి సంరక్షణకు ఏం చేయాలో చెబుతారు. దోమ, పురుగు, తెగుళ్ల నియంత్రణ.. పూత, కాత, చెట్ల సంరక్షణ కోసం వినియోగించే ఎరువులు, పురుగుమందుల పేర్లన్నీ అయన ఇట్టే చెబుతాడు. అలాగని కంపెనీల పేర్లతో పురుగుమందుల పేర్లు చెప్పడు.
కేవలం వాటి ఫార్ములా మాత్రమే చెబుతాడు. కొత్త పరిశోధనలు, కొత్తగా వస్తున్న ఎరువులు, పురుగుమందుల ఫార్ములాలు వెంటవెంటనే తెలుసుకుంటాడు. పంట బాగా వచ్చేలా చేయడమే కాకుండా రైతులకు మంచి ధర వచ్చేలా మార్కెటింగ్ అంశాలను కూడా చెబుతాడు. రైతుకు ఆదాయం వచ్చేందుకు అన్ని విధాలా సహకరిస్తాడు. మొత్తంగా పండ్లు, పూల తోటల పెంపకం మొదలు పెట్టే కొత్త వారికి ఆయనో దిక్సూచి అని చెప్పొచ్చు. పాత రైతులకు ఓ గైడ్ అని అనొచ్చు.
మన మొక్కలే మేలు
పండ్లు, పూల మొక్కలు అనగానే చాలా మంది దూరంగా ఆలోచిస్తారు. వ్యవసాయ పంటలకు వీటికి చాలా తేడా ఉంటది. ఇతర పంటలకు విత్తనాలు వేయగానే వాటి గుణం తెలుస్తది. మొలిచినయా లేదా అనేది వారంలోపు తేలిపోతది. మొక్క పెరిగినా పంట వచ్చేది లేనిది నెలల్లోనే అర్థమైతది. పండ్లు, పూల మొక్కలు అలా కాదు. వాటిని నాటడం, సంరక్షించడం పెద్ద పని. నాలుగైదేండ్లు పెంచాలి. చాలా ఖర్చయితది. ఆ తర్వాత అవి పూసేది, కాసేది తెలుస్తది. అన్నేండ్లలో తోటల కోసం రైతులు లక్షలు ఖర్చు చేస్తరు. అప్పుడు మొక్కలు మంచివి కావని తేలితే బాగా నష్టపోతరు. పండ్లు, పూల తోటల రైతులు బాగా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో పంటలకు పూర్తి అనుకూల ప్రాంతం. ఇక్కడ పెంచిన మొక్కలు అయితేనే మన దగ్గర బాగుంటాయి. చాలా మంది ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు పోతారు. ఆంధ్రప్రదేశ్కు పోయి తెచ్చుకుంటరు.
హార్టికల్చర్ పరంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నర్సరీలు బాగుంటాయి. అక్కడ పెరిగిన మొక్కలు తెలంగాణ అంతటా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మంచిగా పెరుగుతాయి. మొక్కలు మొదటి నుంచి పెరిగిన వాతావరణం లాంటిదే తోటలు పెంచే చోట ఉండాలి. కొత్తగా తోటలు పెట్టే వారికి, మొక్కలు కొనే వారికి నేను ఇదే చెబుతాను. దూర ప్రాంతాలకు పోతే ఖర్చు ఎక్కువే.
తెలంగాణలో తోటలు పెరుగుతున్నయి
గతంలో ఇట్ల లేదు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. ఎండకాలంలో బోర్లు పోయక, బావుళ్ల నీళ్లు లేక తోటలు ఎండిపోయేవి. ఏడాది మొత్తం కాపాడింది అంతా పోయేది. కరువులు వచ్చినప్పుడు ఏండ్ల నాటి తోటలు ఎండిపోయిన పరిస్థితులు చూసినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక పండ్లు, పూల తోటల పెంపకం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ప్రాజెక్టులను పూర్తి చేసిండు. పుష్కలంగా నీరు వస్తున్నది. బీడు భూములళ్ల పంటలు వేస్తున్నరు. చాలా భూముల్లో కొత్తగా తోటలు పెడుతున్నరు. మన ఏరియాలో ఎక్కువగా మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, పొప్పడి తోటలు పెడుతున్నారు. పామాయిల్, దానిమ్మ వంటివి పెడుతున్నరు. మార్కెట్లలో డిమాండ్ మేరకు పూల తోటలు సాగుచేస్తున్నరు. రాష్ట్రంలో నీటి వనరులు పెరుగడం వల్లే ఇప్పుడు అంతటా తోటలు కనిపిస్తున్నయి.
హరితహారంతో డిమాండ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడు. అంతా పచ్చగా ఉండాలని హరితహారం మొదలుపెట్టిండు. మొదట్లో అందరు ఏదో అనుకున్నరు. ఇప్పుడు ఫలితం కనిపిస్తున్నది. ప్రతి ఊరిలో, ఇంటిలో మొక్కలు పెంచాలనే ఆలోచన బాగా వచ్చింది. మొక్కలు పెంచితే వాతావరణ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా సంతృప్తి అనిపిస్తది. హరితహారంతో ఎక్కువ మందిలో మొక్కల పెంపకంపై ఆలోచన పెరిగింది. నర్సరీలోనూ మొక్కలకు గతంలో కంటే డిమాండ్ పెరిగింది. రకరకాల మొక్కలు కావాలని అడుగుతున్నరు. ఫారిన్ వెరైటీలు తెప్పించాలని కోరుతున్నరు. ఇండ్లలో మొక్కలు పెంచడం బాగా పెరుగుతున్నది. కొద్దిపాటి జాగ ఉన్నా మొక్కలు పెంచుతున్నరు. అపార్ట్మెంట్లలో కుండీలల్ల మొక్కలు పెడుతున్నరు. ఇండ్లపైనా అన్ని రకాల మొక్కలను పెంచుతున్నరు. కూరగాయలు సొంతంగానే పండించుకుంటున్నరు. రోజురోజుకూ ఈ సంస్కృతి పెరుగుతున్నది. మొక్కులు ఎక్కువ ఉంటే వాతావరణమే కాదు.. అన్నీ బాగుపడుతై.
ట్రెయినింగ్ సెంటర్లో అవకాశం
గతంలో పనికి ఆహారం పథకంలో మామిడి తోటల పెంపకానికి అవకాశం ఉండేది. డీఆర్డీఏ వాళ్లు బయటి నుంచి మొక్కలు తెప్పించి ఇచ్చేవారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని కొందరు రైతులు మా నర్సరీ మొక్కలే కావాలన్నరు. అధికారులు కుదరదన్నరు. అప్పుడు మంత్రిగారు జోక్యం చేసుకుని కలెక్టర్కు చెప్పడంతో రైతులకు మా నర్సరీ మొక్కలు తీసుకుపోయేందుకు అవకాశం ఇచ్చిన్రు. ఆ తర్వాత డీఆర్డీఏగా ఉన్న చిరంజీవులు సార్ తోటలను పరిశీలించారు. మా మొక్కల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలా మాకు హసన్పర్తిలోని ట్రెయినింగ్ సెంటర్లో మొక్కల సరఫరా, లాన్ డిజైనింగ్ చేసే అవకాశం వచ్చింది. అక్కడ సరిగా నీరు సరఫరా చేయక మొక్కలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
చిరంజీవులు సార్ పిలిచి అడిగితే రెండు మందులు కొట్టి నీరు పెడితే అంతా బాగవుతుందని చెప్పిన. అలాగే అయ్యింది. అప్పుడు మొక్కల సంరక్షణలో నాకున్న అవగాహనను సారు మెచ్చుకున్నరు. ఆ తర్వాత మొక్కల సంరక్షణ, నిర్వహణ కోసం మహిళా సంఘం వాళ్లకు శిక్షణ ఇచ్చిన. ఆ ఆవరణ చాలా బాగుంటుంది. అప్పటి గవర్నర్ కుముద్బెన్ జోషి, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు వచ్చినప్పుడు నన్ను అభినందించారు. సీఎం హోదాలో చంద్రబాబు వచ్చినప్పుడు మేం ఏర్పాటు చేసిన లాన్లోనే మహిళా సంఘం సభ్యులతో మాట్లాడారు. అక్కడికి వచ్చిన చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల అభినందనలు నేనెప్పటికీ మరిచిపోలేను.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అభినందన
చదువుకొని నర్సరీ రంగంలోకి రావడం ఏమిటని చాలా మంది అనేవారు. ఇది నాకు ఇష్టమైన పని. నర్సరీ అంటే చాలా మంది మొక్కలు అమ్మడంతోనే ఆగిపోతారు. మేం ఇండ్లు, ఆఫీసుల ఆవరణలో మొక్కలు పెంచడంలో ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తుంటం. ఈ పని మాకు కలిసి వచ్చింది. మా దగ్గర మొక్కలు తీసుకువెళ్లే వారి సాయంతో హంటర్రోడ్డులోని ఐటీఎం కాలేజీలో లాన్ డిజైనింగ్ కోసం పిలుపు వచ్చింది. అక్కడికి వెళితే ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి చెప్పారు. కాలేజీ ఆవరణలో కలిసిపోయి ఉన్న వేప, రావి చెట్లకు ఏ ఇబ్బంది కలుగకుండా లాన్ డిజైన్ చేయాలని అన్నరు. లాన్లో ఐటీఎం అని పేరు వచ్చేలా వృత్తాకారంలో డిజైన్ చేసి చూపించినం. పని పూర్తయినంక పిలిచి అభినందించారు.
ఐటీఎం మెయిన్ ఆఫీస్ ముంబైలో ఉంటది. 2001లో అక్కడ లాన్ ఏర్పాటు చేసేందుకు ఓ కన్సల్టెన్సీ కంపెనీని పిలిస్తే డిజైనింగ్, లాన్ కలిపి రూ.20 లక్షలు చెప్పారట. హంటర్రోడ్డు లాన్ చేసిన అనుభవం ఉందని నాకు అవకాశం ఇచ్చారు. నాన్న, నేను కలిసి వెళ్లి అక్కడే ఉండి పూర్తి చేసినం. కన్సల్టెన్సీ చెప్పిన దానిలో 25 శాతంతో మంచి డిజైన్ చేసినం. కాలేజీ భవనం ప్రారంభోత్సవానికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వచ్చారు. మేం చేసిన లాన్ డిజైన్ చూసి చాలా మెచ్చుకున్నారు. ఆ అభినందన నా జీవితంలో గొప్ప అనుభూతి. ఆ తర్వాత ఐటీఎం ప్రతి బ్రాంచిలోనూ లాన్ మేమే చేసినం. ఆ అవకాశాలతో ఆర్థికంగానూ ఇబ్బందులు తొలగిపోయాయి.
కేటీపీపీలో భారీగా మొక్కలు
భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నది. అప్పటి హార్టికల్చర్ ఆఫీసర్ మంచి పండ్ల మొక్కల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా నర్సరీ పేరు చెప్పారు. ఆ సమాచారంతో కేటీపీపీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను వెళ్లితే మొదట ఆరు వేల మొక్కల ఆర్డర్ ఇచ్చారు. లారీలు తీసుకుని వెళ్లినప్పుడు స్వయంగా సీఈ వచ్చి చూశారు. హైదరాబాద్ కంపెనీ వాళ్లు ఇచ్చిన కొటేషన్ కంటే మేం సరఫరా చేసిన ధర ఒక మొక్కపైనే రూ.500 వరకు తేడా ఉన్నది. మొక్కలు బాగుండడంతో సీఈ సర్ వెంటనే మరో పది వేల మొక్కలకు ఆర్డర్ ఇచ్చారు. అలా కేటీపీపీలోని ప్రతి మొక్క మా నర్సరీ నుంచే సరఫరా చేసినం. సీఈ, ఎస్ఈ, డీఈ, ఏడీ సార్లు ఇచ్చిన సూచనల మేరకు అక్కడి ఆఫీసులు, క్వార్టర్లు, రోడ్లు, అన్ని చోట్ల విభిన్న రకాలను పెట్టినం. ఇప్పుడు కేటీపీపీలో చూస్తే అంతా పచ్చగా, ఆహ్లాదంగా ఉన్నది. అక్కడికి పోతే చాలా ఖుషీ అనిపిస్తది.