వరంగల్, ఫిబ్రవరి 5 (నమస్తేతెలంగాణ): వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వరంగల్ రంగశాయిపేటలో టెక్నికల్ సెంటర్(హబ్)కు రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలిపింది. ఈ టెక్నికల్ సెంటర్ నిర్వహణ కోసం భవన నిర్మాణం, ప్లాంట్, యంత్రాలను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. వీటిలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నది. అది వరంగల్లోని రంగశాయిపేటలో ఏర్పాటు చేయడానికి మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి.
ఈ సెంటర్ను విశేషమైన సామర్థ్యంతో నిర్మించేందుకు కేంద్రం సంకల్పించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అధునాతన సాంకేతికతను సమకూర్చడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల సృష్టి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక, వ్యాపార సలహాలు అందించడం వంటి అంశాల్లో ఈ టెక్నికల్ సెంటర్ ప్రభావంతమైన పాత్ర పోషించనుంది. పలు రకాల పరిశ్రమలకు అవసరమైన సేవలను అనుసరించి ఇది శిక్షణా కార్యక్రమాలను చేపట్టనుంది. నిర్మాణ, ఎలక్ట్రికల్, ఫౌండ్రీ, లెదర్, గ్లాస్, స్పోర్ట్స్ వంటి వివిధ రంగాలకు టెక్నికల్ సెంటర్ సేవలను అందించనుంది. రాష్ట్రంలో ఇదే తొలి టెక్నికల్ సెంటర్ కానుంది. దీంతో ఈ సెంటర్ వరంగల్ జిల్లాలో మైలురాయిగా నిలవనుంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే టెక్నికల్ సెంటర్ వరంగల్లో ఏర్పాటు కానుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పట్టుదలతో వరంగల్లో టెక్నికల్ సెంటర్ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని మంత్రి కొండా సురేఖకు అభినందనలు తెలిపారు.