హనుమకొండ/ఖిలావరంగల్, అక్టోబర్ 6 : నగరంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ బహిరంగసభ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సభకు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు కార్యకర్తలు పోటెత్తారు. అన్ని డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. డప్పుచప్పుళ్లతో ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువ మంది తరలివచ్చినా ఎక్కడా ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జనాన్ని చూసిన మంత్రి కేటీఆర్, చీఫ్విప్ దాస్యం సంతోషం వ్యక్తం చేశారు.
రామన్న తన ప్రసంగంతో గులాబీ సైనికులు, ప్రజల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న తన ఆటపాటలతో సభికులకు ఆకట్టుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ సభకు లబ్ధిదారులు 60వేలకు పైగా తరలివచ్చారు. మహిళలు కోలాటం, డప్పు వాయిద్యాలతో ర్యాలీగా చేరుకున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు తమ కులవృత్తుల పరికరాలతో తరలివచ్చి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. మున్నూరుకాపులు నాగళ్లతో, యాదవులు డప్పు డోలు వాయిద్యాలు మోగిస్తూ వచ్చిన తీరు ఆకట్టుకుంది. పలు డివిజన్ల కార్పొరేటర్లు ర్యాలీగా తరలివచ్చారు. సభలో సింగర్ మధుప్రియ, కళాకారులు ఆటపాటలతో అలరించారు.