కాజీపేట, జనవరి 9 : కాజీపేట వ్యాగన్ పీవోహెచ్ (పీరియాడికల్ ఓవరాలింగ్ హెడ్) షెడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. ఈ నెల 19న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని రాష్ట్రంలో రూ.7 వేల కోట్ల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హైదరాబాద్కు రానున్నారు.
ఈ క్రమంలో కాజీపేటలో వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణ పనులకు సికింద్రాబాద్ నుంచి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. తెలంగాణలో అన్ని అర్హతలు ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీల బృందంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి పెంచారు.
2016-17 కేంద్ర రైల్వే బడ్జెట్లో కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో 160 ఎకరాల స్థలంలో వ్యాగన్ పీవోహెచ్ ఏర్పాటుకు రూ.386 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి మడికొండ శివారు అయోధ్యపురంలోని సీతారామ చంద్రస్వామి ఆలయానికి చెందిన 159 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎకరం భూమిని రూ.42 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలోనే ఆ భూమి ని జిల్లా అధికార యంత్రాంగం అధికారికంగా రైల్వే శాఖ కు అప్పగించింది. ఇటీవల ఆర్వీఎన్ఎల్ సంస్థ నిర్మాణ పనుల టెండర్లను కూడా పూర్తి చేసింది. ఈ షెడ్లు నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు మొదటిదని, దీని నిర్మాణంతో కాజీపేట జంక్షన్ మరింత అభివృద్ధి చెందుతుందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. పీవోహెచ్ షెడ్డు నిర్మాణంతో జిల్లాలో ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 8 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రు లు, చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.