పోచమ్మమైదాన్, బవరి 10: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర చలనచిత్ర , రంగస్థల అభివృద్ధి సంస్థల సౌజన్యంతో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఈనెల నుంచి 18వ తేదీ వరకు సాహిత్య, నాటక రజతోత్సవాలు-2023 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉదయం 10గంటలకు హనుమకొండ బాలసముద్రం లోని సామా జగన్మోహన్రెడ్డి స్మారక భవన్లో జరిగే సాహిత్య నాటక రజతోత్సవ ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, అతిథులుగా సీఎం కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ మాసపత్రిక సంపాదకుడు అష్టకాల రామ్మోహన్, హైదరాబాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీరంగాచార్య, విజయవాడకు చెందిన ప్రవచన చక్రవర్తి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, మందాడి శ్యాంప్రసాద్రెడ్డి, డాక్టర్ అంపశయ్య నవీన్, వీఆర్ విద్యార్థి పాల్గొంటారని వివరించారు. అలాగే సాయంత్రం పబ్లిక్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో సాయంత్రం 6.30గంటలకు రజతోత్సవ తెలుగుభాషా ఆహ్వాన నాటక పోటీల ప్రారంభ సభలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, జ్యోతి ప్రజ్వలన నేరెళ్ల శోభా వేణుమాధవ్, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ల రాంచందర్రావు, ప్రముఖ రచయిత డాక్టర్ నంగనభట్ల నరసయ్య, ఏవీ సత్యమోహన్ హాజరవుతున్నట్లు తెలిపారు.
15న ఉదయం 10గంటలకు జరిగే కార్యక్రమంలో చీరాలకు చెందిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, సాయంత్రం 6.30గంటలకు జరిగే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ బీ గోపి, విశిష్ట అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొంటారని, రాత్రి 7 గంటలకు గంగోత్రి పేదకాకాని వారి ‘పేగు రాసిన శాసనం’ రాత్రి 8.30 గంటలకు పండు క్రియేషన్స్ కొప్పోలు, ఓంగోలు వారి ‘పక్కింటి మొగుడు’ నాటకాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. 16న సాహితీ ప్రముఖులకు సత్కారం, రంగస్థల కళాకారులకు సన్మానంతోపాటు మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్ వారి ‘ఉన్నది ఒకటే జీవితం’, అంజనారాథోడ్ చిలకలూరిపేట గుంటూరు వారిచే ‘నాన్నా నేను వచ్చేస్తా’ నాటకాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పూర్వ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్, వాడ్రేవు చిన వీరభద్రుడు, నందివెలుగు ముక్తేశ్వర్రావు, ఆచార్య బన్న విజయ్భాస్కర్, నాగిళ్ల రామశాస్త్రి, టీ శ్రీరంగస్వామి పాల్గొంటారని, ఈ సందర్భంగా రాత్రి మహతి క్రియేషన్స్ హైదరాబాద్ వారి జయతే’ సిరిమువ్వ కల్చరల్ హైదరాబాద్ వారి ‘దారుణం’ ప్రదర్శన ఉంటుందని వివరించారు.
18న ఉదయం రంగస్థల కళాకారులకు సన్మానం, శ్రీ సాయిఆర్ట్స్ కొలకలూరు వారి ‘ప్రేమతో నాన్న’ జాబిల్లి కల్చరల్ సొసైటీ నిజామాబాద్ వారి ‘అసురవేదం’ ప్రదర్శన, సాయంత్రం ముగింపు సమావేశంలో సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు, ముఖ్య అతిథిగా తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాకుల, ప్రముఖ సినీనటులు కోట శంకర్రావు పాల్గొననున్నారని, అనంతరం సహృదయ రంగస్థల పురస్కారం, శివరాత్రి సందర్భంగా రాత్రి 10.30 గంటలకు నృత్య స్రవంతి కూచిపూడి కళాక్షేత్రం వరంగల్ వారి శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఉంటుందని వివరించారు.