మారిన గ్రామాల రూపురేఖలు
ట్రాక్టర్లతో ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ
ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలింపు.. ఎరువుల తయారీ
నిత్యం పారిశుధ్య పనులతో ఆహ్లాదకర వాతావరణం
సీజనల్ వ్యాధులు పరార్
పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్న ఊళ్లు..
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలకు సరికొత్తరూపును తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కారు నాలుగు విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నెలనెలా క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులతో ఊళ్లన్నీ ప్రగతి బాటపట్టాయి. పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. దీంతో చాలావరకు గ్రామాల్లో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ప్రభుత్వం కొనిచ్చిన ట్రాక్టర్లు, ట్రేలర్లు, ట్యాంకర్లు పల్లెల్లో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. నిత్యం జీపీ సిబ్బంది వీటితో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువులను కూడా తయారు చేస్తున్నారు.
మహబూబాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలను మార్చింది. రాష్ట్ర సర్కారు 4 విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. గ్రామాల్లో ఏళ్లుగా పేరుకుపేయిన చెత్తాచెదారం తొలగిపోయింది. ప్రభుత్వం క్రమంగా విడుదల చేస్తున్న నిధులను వందశాతం గ్రామాల అభివృద్ధికి వెచ్చించి, నిత్యం పారిశు ధ్య పనులు చేపట్టడంతో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో చెత్తాచెదారం, రోడ్లకిరువైపులా తుమ్మలు, ముళ్లపొదలు తొలగించడంతోపాటు మురుగునీటిని డ్రైనేజీల ద్వారా బయటికి పంపడం వంటి చర్యలతో సీజనల్ వ్యాధులకు చెక్ పడింది. తీరొక్క మొక్కలతో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు లు, నర్సరీలు ఏర్పాటు చేయడంతో నూతన శోభను సంతరించుకున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం కొనిచ్చిన ట్రాక్టర్లు గ్రామపంచాయతీల్లో సరికొత్త విప్లవాన్నే సృష్టించాయి. ప్రతిరోజూ ఉదయం పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్ ట్రేలర్ల ద్వారా సేకరించిన డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇలా ఏ రోజుకారోజు చెత్త సేకరిస్తుండడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. దీంతో వానకాలం, చలికాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయి. జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో ప్రతి నిత్యం ఈ ప్రక్రియ కొనసాగుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గ్రామాల్లో సేకరించిన చెత్తను శివార్లలో నిర్మించిన కంపోస్ట్ షెడ్లకు తరలిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి చెత్త, గాజు బాటిల్స్, ప్లాస్టిక్, పాత సీసాలు, పేపర్లు, అట్టలను వేరు చేసి, అక్కడే ఉన్న చిన్న గదిలో వేస్తున్నారు. ఇలా వేరు చెత్తతో ఎరువులను తయారు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం సమకూరనున్నది.
ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నారు
గ్రామంలో ప్రతిరోజూ ఉదయం పూట గ్రామపంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వా రా చెత్తను సేకరించి, డంపిం గ్ యార్డుకు తరలిస్తున్నారు. ఉదయం పూట రోడ్లు, మురి కి కాల్వలను శుభ్రం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఏ రోజుకా రోజు చెత్త తరలిస్తుండడంతో గ్రామ శు భ్రంగా ఉంది. సీజన్ వ్యాధులు కూడా బాగా తగ్గాయి.
–అజ్మీరా నరేశ్, గోపతండా గ్రామపంచాయతీ
100శాతం చెత్తను సేకరిస్తున్నాం
జిల్లాలో 461 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. అన్ని జీపీల్లో సుమారు రూ. 11.15కోట్లతో నిర్మించాం. ప్రస్తుతం అన్నీ వినియోగంలో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం సిబ్బంది గ్రామాల్లో సేకరించిన చెత్తను కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామాలన్నీ శుభ్రంగా మారి సీజనల్ వ్యాధులు తగ్గాయి.
– జిల్లా పంచాయతీ అధికారి, సాయిబాబా