తాడ్వాయి, ఫిబ్రవరి 5 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 6 వేల బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం వారు తాడ్వాయి మండలకేంద్రంలో పాటు మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ పనులను ఎండీ సజ్జనార్తో కలిసి పరిశీలించారు. సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటుచేసిన తడకల షెడ్ల ను పరిశీలించారు. అలాగే క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు, టికెట్ ఇష్యూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనదేవతల దర్శనానికి వెళ్లగా పూ జారులు, దేవాదాయ శాఖ అధికారులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఎత్తు బంగారంతో గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మహా జాతర సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 6వేల బస్సుల ద్వారా భక్తులను మేడారానికి చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 14.50 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేయగా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ సిబ్బందిని మంత్రులు అభినందించారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ జాతరను ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారమన్నారు. 30లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామని, రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి జాతరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఈమేరకు జిల్లాలో 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించామన్నారు. ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి మేడారంలో బేస్ క్యాంపును ప్రారంభిస్తామన్నారు. 14వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తార ని, వారికి వసతి, భోజన విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని సజ్జనార్ తెలిపారు. అనంతరం ఏసీ లహరి బస్సులను మంత్రులు ప్రారంభించారు.
ములుగు, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : మహా జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు సీతక్క, పొన్నం సోమవారం మే డారం వెళ్లారు. హైదరాబాద్ నుంచి కారులో వెళ్తున్న వారు ప్రభుత్వ పథకాలతో పాటు మేడారం లో కల్పించిన సౌకర్యాలు, తెలంగాణ సాధనలో జరిగిన సంఘటనలపై ముచ్చటిస్తూ 12 నిమిషాల నిడివితో ప్రత్యేక వీడియోను తీశారు. దీనిని సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చే యగా వైరల్ అయింది. కొందరు జేజేలు కొడితే మరికొందరు నెటిజన్లు మేడారంలో సౌకర్యాలు మెరుగుపర్చాలని, ఆర్టీసీ కార్మికుల బాధలకు విముక్తి కల్పించాలని, భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తూ కామెంట్లు పెట్టారు. కాగా, ఆర్టీసీ, ఇతర శాఖల ద్వారా మేడారం భక్తులకు తల్లుల ప్రసాదం(బెల్లం) పంపిణీ చేయాలని మంత్రులు చర్చించుకున్నారు.
ములుగు రూరల్, ఫిబ్రవరి 5 : గట్టమ్మ దేవాలయాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. పూజారి కొత్త సదయ్య గట్టమ్మ ఆశీస్సులను మంత్రులకు అందించారు. ఈ నెల 14న నిర్వహించనున్న ఎదురుపిల్ల పండుగ వాల్పోస్టర్లను మంత్రులతో ఆదివాసీ నాయకపోడ్ గట్టమ్మ పూజారులు ఆవిష్కరింపజేశారు. ఇంచర్ల సమీపంలోని ఎర్రి గట్టమ్మను సైతం మంత్రులు దర్శించుకొని మేడారానికి తరలివెళ్లారు. అలాగే ఆర్టీసీ ప్రయాణికుల కోసం గట్టమ్మ వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఎండీ సజ్జనార్ ఎస్పీ శబరీష్తో కలిసి పరిశీలించారు. గట్టమ్మకు పూజలు చేసిన ఆయన బస్సుల రాకపోకలపై ఎస్పీతో చర్చించారు. వారి వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, డీఎస్పీ రవీందర్, సీఐ రంజిత్కుమార్, ఎస్సై వెంకటేశ్వర్, గట్టమ్మ పూజారులు కొత్త సదయ్య, లక్ష్మయ్య, సురేందర్, రాజేశ్, చిర్ర రాజేందర్, అరిగెల సుమతి, సరోజన, నిర్మల ఉన్నారు.