న్యూశాయంపేట, మార్చి 28 : నిత్యం ప్రజల మధ్యే ఉంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పర్వతగిరి మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై స్థానిక సమన్వయ కమిటీతో హనుమకొండ హంటర్రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని తెలిపారు. సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, అభివృద్ధి పనుల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై వారిచ్చే వినతులను స్వీకరించి, పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ పని చేయాలన్నారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీతో మండలంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. మండల పరిధిలో ప్రతి గ్రామానికి స్వయంగా సమన్వయ కమిటీ వెళ్లి అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ఆమలు తీరుపై ప్రజలతో చర్చించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శాంతిరతన్రావు, ఏకాంతంగౌడ్, మనోజ్కుమార్గౌడ్, రంగు కుమార్గౌడ్, రాజేశ్వర్రావు, జితేందర్రెడ్డి పాల్గొన్నారు.