భీమదేవరపల్లి, జూలై 4 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించి 1,295 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునీత తెలిపారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 1062 వరకు ఆలయాలు ఉండగా వాటి ఆధీనంలో 3,295 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు.
ఇందులో 210 ఆలయాలకు సంబంధించిన 1,295 ఎకరాల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం అవుతున్న క్రమంలో నిరుపయోగంగా ఉన్న ఆలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా తొలుత మహబూబాబాద్ జిల్లాలోని అగస్తేశ్వరాలయంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 458 దూప, దీప నైవేద్యాల కింద ఆలయాలు ఉండగా నూతనంగా మరో 282 దరఖాస్తులు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఆలయాల్లోని భూముల్లో వన మహోత్సవ కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆలయ ఈవో కిషన్రావు ఉన్నారు.