కాజీపేట, జూలై 28 : కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్ష సెక్షన్లో మూడోలైన్ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అసిఫాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ల మధ్య 11 కిలోమీటర్ల చివరి దశ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే అను సంధానానికి, మరింత బలోపేతం చేసే దిశగా ఈ మార్గం కీలక మైలురాయిగా నిలువనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాజీపేట-బల్లార్ష సెక్షన్లోని గ్రాండ్ ట్రంక్ మార్గంలో సెక్షన్ సామర్థ్ధ్యాన్ని పెంచడంపై రైల్వే ప్రత్యేక దృష్టిని సారించి మూడో లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే 2015-2016 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 3,000 కోట్ల వ్యయంతో(తెలంగాణలో 159 కి.మీ, మహారాష్ట్రలో 44 కి.మీ) మొత్తం 203 కిలోమీటర్ల మూడోలైన్ నిర్మాణ పనులను మొదలుపెట్టి దా దాపు దశాబ్దకాలంలో దశల వారీగా 2026 జూలై 22న పూర్తి చేసింది. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే బల్లార్ష స్టేషన్ సమీపంలోని కొంతభాగం మినహా, మూడోలైన్తో యార్డుకు అనుసంధానం చేస్తున్న పనులు జరుగుతున్నాయి. బొగ్గు, సిమెంట్ సైడింగ్లను అనుసంధానం చేస్తూ, గ్రాండ్ ట్రంక్ మార్గంలో నడిచే రైలు సర్వీసులు సజావుగా సాగేందుకు ఈ మార్గం ఎంతో వీలుగా మారనుంది.
ఈ సెక్షన్ల మధ్య రైలు మార్గం ప్రయాణికుల, బొగ్గు, సిమెంట్, సున్నపు రాయి, గ్రానైట్ తదితర సరుకుల రవాణాతో నిరంతరం రద్దీగా ఉంటాయి. రైళ్ల రద్దీని, గూడ్స్ రవాణా, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడిచే రైళ్లతో పాటు, న్యూఢిల్లీ-చెన్నై-ముంబై తదితర రైళ్ల ప్రయాణికుల రాకపోకల ఆలస్యాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును విజయవంతంగా కృషి చేసిన ఇంజినీరింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఆపరేటింగ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ అభినందించారు.