ములుగు, అక్టోబర్18 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం నిర్వహించిన సభ పరిస్థితి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. చాటింపు గొప్పగా ఉన్నా.. సభ చప్పగా సాగడంతో ప్రజల నుంచి స్పందన కరువైంది. తెలంగాణ ప్రాంతంపై ఆవగింజంతైనా అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీల ప్రసంగాల్లో ప్రసలేకపోవడం, వారు హిందీలో ఒకటి చెబితే ఉత్తమ్కుమార్రెడ్డి తెలుగులోకి అనువదిస్తూ మరోటి చెప్పడంతో సభకు వచ్చినవారు బిత్తరచూపులు చూశారు. పసలేని ప్రసంగాన్ని వింటూ మహిళలు ‘దేవుడా రాములా’ అంటూ అర్థం కానిముచ్చట్లను కాసేపు విన్నారు. ఎంత విన్నా సొంపుగా లేదని అనుకున్నారో ఏమో రాహుల్ ప్రసంగిస్తుండగానే మహిళలు బయటకు వెళ్లిపోయారు. ప్రజలు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆగండంటే ఎక్కడ చీవాట్లు పెడుతారోనని ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారు.
రామప్పకు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారని బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న క్రమంలోనే వెళ్లిపోయి హస్తం నేతలను అవాక్కయ్యేలా చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు సైతం ప్రియాంక మాట్లాడుతున్న క్రమంలోనే వేదిక దిగి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రియాంక మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో ప్రధానులుగా పనిచేసిన పలువురి పేర్లను ప్రస్తావించి తెలంగాణ నుంచి ఐదేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహారావు పేరును ప్రస్తావించకపోవడం తెలంగాణపై ఆమెకున్న వివక్షకు అద్దంపట్టింది. ‘అసలు వీళ్లు ఎందుకు వచ్చినట్లు..? ఏం చెబుతున్నట్లు?’ అంటూ చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్రాన్స్లేషన్ బాధ్యతను ఉత్తమ్కుమార్ తీసుకోగా ఆయన కూడా ప్రజలను అయోమయానికి గురి చేశారు. తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలను అందించినా విషయం తెలియకుండానే ప్రియాంక గాంధీ పోడు పట్టాల పంపిణీని ప్రభుత్వం వదిలివేసిందని అవగాహన లేని మాటలు మాట్లాడారు. ప్రియాంక గాంధీ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసే క్రమంలోనూ గండ్ర సత్యనారాయణరావు వేదికపైకి రాలేదు. ఒకట్రెండు సార్లు రేవంత్రెడ్డి పిలిచినా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు గండ్ర ఎందుకు వేదికపైకి వెళ్లలేదని చర్చించుకున్నారు. ములుగు అభ్యర్థి సీతక్క రెండు, మూడు రోజుల నుంచి రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు.. వరాల జల్లులు కురిపిస్తారని చేసిన డప్పు చాటింపు ముచ్చట్లు తుస్సుమన్నాయనే చెప్పవచ్చు. ప్రజలకు ఏం కావాలి, వారి అవసరాలు ఏమిటని గుర్తెరుగని కాంగ్రెస్ నాయకులు, సభ మమ అనిపించారని వచ్చినవారు గుసగుసలాడుకుంటూ ఇంటి దారిపట్టడం కనిపించింది.