హనుమకొండ, జూలై 1: ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన పికెటింగ్ చేపట్టడడంతో ఉద్రిక్తంగా మారింది. హనుమకొండ కలెక్టరేట్ వద్దకు ఉదయం 9 గంటలకే వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, గుడిసెవాసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అధికారులను, సిబ్బందిని కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు పికెటింగ్తో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
‘ పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి.. సీఎం రేవంత్రెడ్డి డౌన్ డౌన్.. ’ అని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుడిసెలను కూల్చిన కాంగ్రెస్ సర్కార్ఫై మహిళలు శాపనార్ధాలు పెట్టారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు సాధించే వరకు ప్రభుత్వం, అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జాదారుల నుంచి కాపాడి, ఆ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేది వామపక్షాలేనని అన్నారు. అందుకే పేదలకు నివాస స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే కోరారు. పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వారిపై దాడులకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, జీ ప్రభాకర్ రెడ్డి, హంసారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, నాయకులు కర్రె లక్ష్మణ్, ఎన్ అశోక్, స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, వేల్పుల సారంగపాణి, బత్తిని సదానందం, జకు రాజు గౌడ్, ఏశబోయిన శ్రీనివాస్, ఎన్ రాజమౌళి, సీపీఎం జిల్లా నాయకులు రాగుల రమేశ్, బొట్ల చక్రపాణి, వీరన్న, ఉప్పలయ్య, మంద సంపత్, గుమ్మడిరాజుల రాములు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.