హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 28 : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. వరంగల్ నిట్లోని సెనెట్హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నిట్కు సంబంధించి రెండు ముఖ్యమైన ఎజెండాలు ఉన్నాయని చెప్పా రు. ముందుగా వరంగల్ నిట్లో రీసెర్చ్ పార్కును అభివృద్ధి చేసి, ఈ సంస్థ ను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానన్నారు. రెండవది కార్పొరేట్తో అనుబంధాన్ని మెరుగుపరచుకోవాలని, ఇన్స్టిట్యూట్లో మల్టీ డిసిప్లినరీ పరిశోధనను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మీడియా సపోర్ట్తో మంచి కార్యక్రమాలను సమాజానికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. వరంగల్ నిట్కు దేశంలోనే మంచి పేరు ఉన్నదన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్క్రైమ్స్ పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు పోలీసులకు ఉపయోగపడేవిధంగా నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు తోడ్పాటునందిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ కమిషనర్ చొరవతో వరంగల్ నిట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే అత్యత్తమంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సమావేశంలో వరంగల్ నిట్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.గోవర్ధన్రావు, పీఆర్వో ప్రొఫెసర్ రాహుల్ పాల్గొన్నారు.