వర్ధన్నపేట, డిసెంబర్ 4 : విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరుగుతున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆదివారం సందర్శించారు. ఎగ్జిబిట్లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను ప్రారంభించిందన్నారు.
దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలంటే సైన్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభ, ఆసక్తిని గుర్తించి వారు కొత్తకొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. మోడల్ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనగా, ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాగా, చిన్నారుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. సంగెం మండలం మొండ్రాయికి చెందిన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి రూపొందించిన బోధనాభ్యసన సామగ్రి విశేషంగా ఆకట్టుకున్నది. అలాగే కోనోకార్పస్ మొక్క పర్యావణంపై చూపుతున్న ప్రభావంపై రూపొందించిన ఎగ్జిబిట్ ఆలోచింపజేసింది. ఈ-వేస్టేజ్ సమస్యను అధిగమించడం, పాడైపోయిన పరికరాలను తిరిగి శుద్ధి చేసే విధానంపై నాచినపల్లి పాఠశాల విద్యార్థి విగ్నేశ్ ఎగ్జిబిట్ రూపొందించాడు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.