నర్మెట, డిసెంబర్ 7: జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో బుధవారం అవుట్ సోర్స్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, అధ్యాపకుడు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఏస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 2013వ సంవత్సరం నుంచి అవుట్ సోర్సింగ్ స్వీపర్గా గడ్డం రేణుక పనిచేస్త్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆమె వేతనం ఏజెన్సీ ద్వారా నెలకు సుమారు రూ.13,600 వస్తుండగా, అప్పటి నుంచి ప్రిన్సిపాల్ అనురాధ ప్రతి నెల రూ.3వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది.
లేకుంటే నీకు వేతనం అందదని భయపెడుతోంది. దీంతో స్వీపర్ అకౌంట్లో పడుతున్న అమౌంట్ నుంచి ప్రతి నెల రూ. 3వేల చొప్పున 7 నెలలకు రూ.21వేలకు రూ.20వేలు ఇవ్వాలని ప్రిన్సిపాల్ తెలుపడంతో గతంలోనే రూ.2వేలు ఇచ్చింది. బుధవారం రూ.18వేలను ప్రిన్సిపాల్ సూచన మేరకు అధ్యాపకుడు మల్లేశ్కు అందించారు. నగదును అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధతో పాటు అధ్యాపకుడు మల్లేశ్ను విచారిస్తున్నారు. వీరిపై పూర్తి విచారణ చేసి శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.