వరంగల్, జూలై 8 : ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ఆయన మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా భద్రకాళీ ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్ద ప్రధాని గోసేవ చేశారు. గోవులకు స్వయంగా గ్రాసం తినిపించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు శేషు మోదీ గోత్రనామాలపై ప్రత్యేక అర్చన చేశారు. అనంతరం ప్రధాని మోదీకి అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, అమ్మవారి శేషవస్ర్తాలు అందజేశారు. అలాగే, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు భద్రకాళీ అమ్మవారి ఫొటోను ఆయనకు బహూకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళీని దర్శించుకున్న తొలి ప్రధాని
వరంగల్ నగరంలోని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం విశేషం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే, ప్రధాన మంత్రి హోదాలో ఇప్పటి వరకు ఎవరూ భద్రకాళీ అమ్మవారి దర్శనానికి రాలేదు. వరంగల్ నగర పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ చరిత్రలోకి ఎక్కారు.
ఒంటరిగా ప్రత్యేక పూజలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, బండి సంజయ్కుమార్తో కలిసి ఆయన భద్రకాళీ ఆలయానికి వచ్చినప్పటికీ ప్రధాని ఒక్కరే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ కూడా ఒంటరిగానే ప్రదక్షిణలు చేశారు. అనంతరం గర్భాలయం ఎదుట అమ్మవారికి ఎదురుగా ప్రత్యేక పీటపై ఆసీనుడై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 5 నిముషాల పాటు అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.